
ముంబై: మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మెరుగ్గా బ్యాటింగ్ చేయగలిగితే.. తప్పకుండా టీమిండియాకి ఆడి తీరుతాడు అని భారత పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. కరోనా వైరస్ (కొవిడ్-19) వ్యాప్తి కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 నిరవధికంగా వాయిదా పడటంతో ఆటగాళ్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. మంగళవారం రోహిత్ శర్మ, భారత వెటరన్ బ్యాట్స్మన్ సురేశ్ రైనా ఇన్స్టాగ్రామ్ లైవ్లో మాట్లాడుకున్నారు.
ఇన్స్టాగ్రామ్ లైవ్ చాట్ సందర్భంగా రైనా, రోహిత్ మధ్య ఎంఎస్ ధోనీ భవితవ్యం గురించి చర్చ వచ్చింది. రైనా మాట్లాడుతూ... 'చెన్నై సూపర్ కింగ్స్ ట్రైనింగ్ సెషన్లో ధోనీతో కలిసి బ్యాటింగ్ చేశా. మహీ భాయ్ చక్కగా బంతిని అతను హిట్ చేశాడు. ఇన్ని రోజులు ఆటకు దూరంగా ఉన్నాడా? లేదా? అనిపించింది. అతను కూడా ఫిట్ గా ఉన్నాడు. కానీ.. ధోనీ మనసులో ఏముందో? అతనికి మాత్రమే తెలుసు. అతని భవిష్యత్ ప్లాన్ ఏంటో చెప్తే మనకీ ఓ క్లారిటీ వస్తుంది. ఒక్కటి మాత్రం చెప్పగలను.. అతనిలో క్రికెట్ ఇంకా మిగిలి ఉంది' అని అన్నాడు.
సురేశ్ రైనా మాటలు విన్న రోహిత్ శర్మ తన అభిప్రాయాన్ని కూడా చెప్పాడు. 'ఎంఎస్ ధోనీ మెరుగ్గా బ్యాటింగ్ చేయగలిగితే.. తప్పకుండా టీమిండియాకి ఆడాలి. మహీ భాయ్ మళ్లీ ఆడగలడని నాకు తెలుసు. తప్పకుండా ఆడతాడు' అని రోహిత్ అని ధీమా వ్యక్తం చేశాడు. ఇంతకుముందు కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ.. ధోనీ వన్డే ఇంటర్నేషనల్ నుంచి తప్పుకునే అవకాశం ఉందని, అయితే ఐపీఎల్ ఆడతాడన్నాడు. ధోనీ మళ్లీ వన్డే క్రికెట్ ఆడకపోవచ్చన్నాడు.
ఇంకా రైనా మాట్లాడుతూ... 'మోకాలి గాయం తర్వాత నన్ను నేను పూర్తిగా మార్చుకున్నా. నా తప్పిదాల్ని దిద్దుకున్నా. చాలా కష్టపడి.. బీసీసీఐ నిర్దేశించిన యో-యో టెస్టులో కూడా పాసయ్యాను. తిరిగి జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నా. కష్టకాలంలో ఎంతో మంతి సీనియర్ ఆటగాళ్లు నాకు అండగా నిలిచారు. ఇప్పటికి నాలో క్రికెట్ మిగిలే ఉంది' అని చెప్పాడు. తనలో ఇంకా క్రికెట్ ఆడే సామర్థ్యం ఉందని చెప్పుకొస్తూ పరోక్షంగా సెలక్టర్ల తీరుపై రైనా మండిపడ్డాడు.
భారత సెలక్టర్ల తీరు గురించి పరోక్షంగా సురేష్ రైనా మండిపడటంతో రోహిత్ శర్మ మాట్లాడుతూ...'రైనా భాయ్.. నిన్ను మళ్లీ భారత్ జట్టులోకి తీసుకునే విషయంపై మేము ప్రతి సిరీస్లోనూ మాట్లాడుకుంటున్నాం. కానీ.. జట్టు సెలక్షన్ మా చేతుల్లో ఉండదు. నిరాశకి గురవకుండా నీ ప్రాక్టీస్ ఇలానే కొనసాగించు. ఎదో రోజు అవకాశం వస్తుంది' అని సూచించాడు.