హైదరాబాద్: ఫిబ్రవరి 14.. ప్రేమికుల దినోత్సవం అన్న సంగతి తెలిసిందే. అలాంటి ప్రేమికుల దినోత్సవం నాడు టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఓ ప్రత్యేకమైన కానుకతో తన భార్య రితికాకు శుభాకాంక్షలు తెలిపాడు. రితికాను ప్రేమించి పెళ్లి చేసుకున్న రోహిత్ శర్మ తాజాగా ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి వార్తల్లో నిలిచాడు.
పోర్ట్ ఎలిజబెత్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదో వన్డేలో రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది 17వ సెంచరీ. సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించిన తెలిసిందే.
ఈ అవార్డుని రోహిత్ శర్మ ప్రేమికుల దినోత్సవం రోజు తన భార్యకు బహుమతిగా ఇచ్చాడు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్లో 'ప్రేమికుల రోజు శుభాకాంక్షలు రితికా' అని కామెంట్ పెడుతూ అభిమానులతో పంచుకున్నాడు. ఇందుకు రితికా కూడా రిప్లై ఇచ్చింది. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
తన వద్ద మేనేజర్గా పనిచేసే సమయంలో రితికాతో ప్రేమలో పడిన రోహిత్ శర్మ ఇరు కుటుంబ పెద్దలను ఒప్పించి రితికాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది శ్రీలంక పర్యటనలో తన పెళ్లి రోజున మ్యాచ్ని చూసేందుకు వచ్చిన భార్యకు రోహిత్ డబుల్ సెంచరీ బాది అపురూపమైన కానుక ఇచ్చిన సంగతి తెలిసిందే.
సెంచరీ అనంతరం భార్యవైపు చూస్తూ ఫ్లైయింగ్ కిస్ ఇవ్వడంపై అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. 'నాకు ప్రత్యేకమైన రోజున నా భార్య పక్కన ఉండటం సంతోషకరమైన విషయం. ఆమెకు నేనిచ్చిన ఈ బహుమతి బాగా నచ్చిందనుకుంటున్నా. ఆమె నాబలం. ఆమె ఎప్పుడు నాతోనే ఉంటుంది' అని అప్పట్లో రోహిత్ శర్మ అన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.