
స్వల్పకాలిక లక్ష్యాల మీదే దృష్టిపెడతా:
గురువారం ఓ టీవీ షోలో రోహిత్ శర్మ మాట్లాడుతూ... 'దీర్ఘకాలిక లక్ష్యాలు పెద్దగా ఫలితాలివ్వవని నా సుదీర్ఘ కెరీర్ ద్వారా అర్థమైంది. అంతేకాదు వాటివల్ల ఒత్తిడి కూడా ఏర్పడుతుందని గ్రహించా. అందుకే నేను ఎప్పుడూ స్వల్పకాలిక లక్ష్యాల మీదే దృష్టిపెడతా. ఎప్పుడూ రెండు, మూడు నెలల్లో జరిగే కొన్ని మ్యాచ్లను దృష్టిలో పెట్టుకునే సన్నద్ధమవుతుంటా. మనం ఎవరితో ఆడతాం, నేను అత్యుత్తమంగా ఏం చేయగలను అని ఆలోచిస్తా. ప్రతి సిరీస్ లేదా టోర్నమెంట్ కోసం లక్ష్యాలను పెట్టుకోవడం నాకు చాలా సాయం చేస్తున్నది. ఈ విధానం ఎంతో ఉత్తమం, ఉపయుక్తంగా కూడా ఉంటుంది' అని తెలిపాడు.

భవిష్యత్తులోనూ ఇలాగే ఆడుతా:
ఇదే బ్యాటింగ్ (స్వల్పకాలిక లక్ష్యాలు) విధానాన్ని భవిష్యత్తులోనూ కొనసాగిస్తా అని రోహిత్ శర్మ చెప్పాడు. లాక్డౌన్పై మాట్లాడుతూ.. తామంతా క్రీడా కార్యక్రమాల పునరుద్ధరణకు ఎదురు చూస్తున్నామన్నాడు. 'కరోనా వైరస్ కారణంగా క్రికెట్ పోటీలు మళ్లీ ఎప్పుడు మొదలవుతాయో ఓ అంచనాకు రాలేకపోతున్నాం. అయితే త్వరలో పరిస్థితులు అనుకూలిస్తాయన్న ఆశాభావంతో ఉన్నాం. టీ20 ప్రపంచకప్, ఐపీఎల్లో ఏది ఆడతామో చూడాలి' అని హిట్మ్యాన్ అన్నాడు.

సానుకూల అంశాలను గమనించాలి:
వైరస్ కారణంగా అందరి జీవితాలు అలజడికి గురయ్యాయని, అయితే ఇలాంటి క్లిష్ట సమయాల్లోనూ కొన్ని సానుకూల అంశాలను గమనించాలని రోహిత్ ప్రజలకు సూచించాడు. 'వైరస్ ఓ తుఫాను లాగా వచ్చి మన జీవితాల్లో అలజడి సృష్టించింది. మనం ఈ పరిస్థితుల్లోనూ సానుకూల అంశాన్ని చూడాలనుకుంటే.. భూమాత కోలుకునేందుకు అవకాశం ఉంటుంది. సంక్షోభంలోనూ మంచిని గ్రహించడాన్ని ఇలాంటి పరిస్థితులే మనకు నేర్పుతాయి. దేనికి కట్టుబడి ఉండాలో తెలియజేస్తాయి' అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

భారత్ రెండు ప్రపంచకప్లు గెలుస్తుంది:
వెటరన్ బ్యాట్స్మన్ సురేశ్ రైనాతో తాజాగా రోహిత్ ఇన్స్టాగ్రామ్ లైవ్లో మాట్లాడి వచ్చే మూడేళ్లలో భారత్ రెండు ప్రపంచకప్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసాడు. 'ప్రపంచకప్ గెలవడం అంత సులభం కాదు. అయితే కప్ను గెలవడం అద్భుతమైన ఫీలింగ్. టోర్నమెంట్తో భావాలు, భావోద్వేగాలు ముడిపడి ఉంటాయి. టోర్నీలోని ఏడు, ఎనమిది జట్లను ఓడించి కప్ను గెలవడం అంత సులభం కాదు. అయితే ద్వైపాక్షిక సిరీస్లు గెలవడం కంటే.. ప్రపంచకప్ నెగ్గితే ఆనందం రెండింతలవుతుంది. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం. సమీప భవిష్యత్తులో మూడు ఐసీసీ మెగా టోర్నీలు ఉన్నాయి. ఒక వన్డే, రెండు టీ20 ప్రపంచకప్లు జరుగనున్నాయి. ఇందులో భారత్ జట్టు కనీసం రెండు గెలుస్తుంది. మూడింటికి మూడు గెలిస్తే ఇంకా మంచిది. మన జట్టు సామర్థ్యాన్ని బట్టి కనీసం రెండైనా గెలవాలి.' అని రోహిత్ అన్నాడు.


Click it and Unblock the Notifications
