తప్పులు సరిదిద్దుకున్నాం:
మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ... 'స్పిన్నర్లు చహల్, సుందర్ చాలా తెలివైన బౌలర్లు. పిచ్ను బాగా అర్థం చేసుకుని అద్భుతంగా బౌలింగ్ చేశారు. బౌలింగ్ను ఎలా మెరుగుపరుచుకోవాలో అని కోచ్, కెప్టెన్తో చర్చలు చేస్తారు. చహల్ ఇప్పటికే చాలా అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. సుందర్ కొత్త బౌలర్, ఇంకా నేర్చుకుంటాడు. గత మ్యాచ్లో కొన్ని తప్పులు చేసాం. వాటిని సరిదిద్దుకున్నాం' అని అన్నాడు.
బౌలర్లను ఎప్పుడూ తక్కువగా అంచనా వేయను: '
'రాజ్కోట్ వికెట్ బ్యాటింగ్కు బాగా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ కష్టంగా మారిపోతుందని తెలుసు. దానిని సద్వినియోగం చేసుకుని పవర్ప్లేలో రేచిపోయాం. ఆ తర్వాత కూడా దూకుడు ఆపలేదు. నేను బౌలర్లను ఎప్పుడూ తక్కువగా అంచనా వేయను. ఇన్నేళ్లుగా నాకు తెలిసిన ఒకే ఒక పని.. బ్యాట్ చేతిలో ఉన్నప్పుడు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడమే. పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో బంతిని బలంగా బాదాలని నిర్ణయించుకున్నా. 2019 అద్భుతంగా సాగింది. దీనిని అలాగే ముగించాలని కోరుకుంటున్నా. వెస్టిండీస్ సిరీస్ రాబోతోంది కాబట్టి మంచిగా రాణించాల్సిన అవసరం ఉంది' అని పేర్కొన్నాడు.
100వ అంతర్జాతీయ టీ20:
భారత్ తరఫున వంద అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడిన తొలి ప్లేయర్గా రోహిత్ శర్మ రికార్డుల్లోకెక్కాడు. పాకిస్థాన్ ఆటగాడు షోయబ్ మాలిక్ (111) మాత్రమే రోహిత్ కంటే ముందున్నాడు. ఎంఎస్ ధోనీ, షాహిద్ అఫ్రీదిని ఇటీవలే అధిగమించిన విషయం తెలిసిందే. ఈ టీ20 మ్యాచ్తో అంతర్జాతీయ టీ20ల్లో తన రెండో వేగవంతమైన (23 బంతుల్లో) హాఫ్ సెంచరీ సాధించాడు.
రోహిత్ మెరుపు ఇన్నింగ్స్:
గురువారం జరిగిన రెండో టీ20 మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులు చేసింది. మహ్మద్ నయీమ్ (31 బంతుల్లో 5 ఫోర్లతో 36) టాప్ స్కోరర్. చాహల్కు రెండు వికెట్లు దక్కాయి. లక్ష్య ఛేదనలో భారత్ 15.4 ఓవర్లలో 2 వికెట్లకు 154 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. రోహిత్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. శిఖర్ ధావన్ (27 బంతుల్లో 4 ఫోర్లతో 31) ఫర్వాలేదనిపించాడు. అమినుల్కు రెండు వికెట్లు దక్కాయి. రోహిత్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు. చివరి మ్యాచ్ ఆదివారం నాగ్పూర్లో జరుగుతుంది.