
రోహిత్ జోస్యం:
భారత్ ఖాతాలో ఇప్పటివరకు రెండు వన్డే, ఒక టీ20 ప్రపంచకప్ ఉన్నాయి. సమీప భవిష్యత్తులో ఒక వన్డే, రెండు టీ20 ప్రపంచకప్లు జరుగనున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ నెలలో ఆసీస్ గడ్డపై టీ20 ప్రపంచకప్ ఉండగా.. వచ్చే ఏడాది భారత్ వేదికగా మరో టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఆపై వన్డే ప్రపంచకప్ ఉంది. ప్రస్తుతం భారత జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉండడంతో.. కనీసం రెండు ప్రపంచకప్లు గెలుస్తుందని రోహిత్ శర్మ జోస్యం చెపుతున్నాడు. భారత వెటరన్ బ్యాట్స్మన్ సురేశ్ రైనాతో తాజాగా రోహిత్ ఇన్స్టాగ్రామ్ లైవ్లో మాట్లాడి పలు విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.

కప్ గెలవడం అద్భుతమైన ఫీలింగ్:
'ప్రపంచకప్ గెలవడం అంత సులభం కాదు. అయితే కప్ను గెలవడం అద్భుతమైన ఫీలింగ్. టోర్నమెంట్తో భావాలు, భావోద్వేగాలు ముడిపడి ఉంటాయి. టోర్నీలోని ఏడు, ఎనమిది జట్లను ఓడించి కప్ను గెలవడం అంత సులభం కాదు. అయితే ద్వైపాక్షిక సిరీస్లు గెలవడం కంటే.. ప్రపంచకప్ నెగ్గితే ఆనందం రెండింతలవుతుంది. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం. అయితే ఓడితే చాలా బాధ కలుగుతుంది. 2019 ప్రపంచకప్లో ఓడిపోవడం చాలా బాధ కలిగించింది' అని రోహిత్ తెలిపాడు.

భారత్ రెండు ప్రపంచకప్లు గెలుస్తుంది:
'సమీప భవిష్యత్తులో మూడు ఐసీసీ మెగా టోర్నీలు ఉన్నాయి. ఒక వన్డే, రెండు టీ20 ప్రపంచకప్లు జరుగనున్నాయి. ఇందులో భారత్ జట్టు కనీసం రెండు గెలుస్తుంది. మూడింటికి మూడు గెలిస్తే ఇంకా మంచిది. మన జట్టు సామర్థ్యాన్ని బట్టి కనీసం రెండైనా గెలవాలి. ఈ మాట ఇప్పటికే చాలాసార్లు చెప్పాను' అని రోహిత్ పేర్కొన్నాడు. భారత్ ఐసీసీ టైటిల్ గెలిచి తొమ్మిదేళ్లవుతున్న విషయం తెలిసిందే. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సారథ్యంలో భారత్ వన్డే ప్రపంచకప్ గెలుచుకుంది.

వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు:
2007లో భారత్ జట్టులోకి అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ.. టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు మాత్రం ఆరేళ్లు సమయం పట్టింది. కెరీర్ ఆరంభంలో మిడిలార్డర్లో బ్యాటింగ్ చేసిన హిట్మ్యాన్ ఆశించిన మేర రాణించలేకపోయాడు. కానీ ఓపెనర్గా మారిన తర్వాత తనలోని సిసలైన ఆటని క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేశాడు. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు, టీ20ల్లోనూ నాలుగు సెంచరీలు చేసి రోహిత్ కెరీర్ బెస్ట్ ప్రదర్శనని ఇచ్చాడు. శ్రీలంకపై 264 పరుగులు చేసి 50 ఓవర్ల ఫార్మాట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రికార్డును కూడా కలిగి ఉన్నాడు.

ఐదు శతకాలతో చరిత్ర:
ఇంగ్లాండ్లో జరిగిన 2019 వన్డే ప్రపంచకప్లో రోహిత్ ప్రభంజనమే సృష్టించాడు. ఐదు శతకాలతో చెలరేగాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా చరిత్రల్లోకెక్కాడు. ప్రపంచకప్లో నాలుగు అత్యధిక శతకాలు చేసిన లంక మాజీ ఆటగాడు కుమార సంగక్కరను అధిగమించాడు. దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లపై శతకాలు చేసాడు. అయితే కీలక సెమీస్ మ్యాచులో మాత్రం విఫలమయ్యాడు.


Click it and Unblock the Notifications












