
సౌథాంప్టన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలు టీమిండియాకు రెండు కళ్లు. జట్టును నడిపించడంలో ఎవరికి వారే సాటి. అంతర్జాతీయ వేదికపై భారత జట్టు అఖండ విజయాలు అందుకోవాలన్నా.. ఐసీసీ ట్రోఫీల్ని ముద్దాడాలన్నా వీరిద్దరూ సమన్వయంతో పనిచేయడం ఎంతో అవసరం. ఒకరికొకరు సహకరించుకోవడం మరెంతో కీలకం. కానీ తరుచూ వీరి మధ్య విభేదాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా 2019 ప్రపంచకప్ నుంచి. న్యూజిలాండ్తో జరిగిన సెమీ ఫైనల్లో ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో ఇద్దరికీ విభేదాలు వచ్చాయని సమాచారం.
2019 వన్డే ప్రపంచకప్ తుది జట్టు విషయంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి విభేధాలు తలెత్తాయని మొదటిసారి ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలకు బలం చేకూర్చేలా కోహ్లీ, అనుష్క శర్మ ఇన్స్టా ఖాతాలను రోహిత్ శర్మ అన్ఫాలో చేయడం చర్చనీయాంశమైంది. అలాగే అనుష్క కూడా రోహిత్తో పాటు అతని సతీమణి రితికాను అన్ ఫోలో చేయడం వీరి మధ్య విభేదాలు నిజమే అనుకునేలా చేశాయి. ఇక మ్యాచులు జరిగేటప్పుడు అనుష్క ఆ చివరన కూర్చొంటే..రితిక ఈ చివరన కూర్చొని వీక్షించిన ఫొటోలు బయటకు వచ్చాయి.
ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్ శర్మను ఎంపిక చేయకపోవడం వల్ల మళ్లీ ఈ వివాదం తెరపైకి వచ్చింది. హిట్మ్యాన్ ఫిట్గా లేడనే అతనికి విశ్రాంతినిచ్చామని సెలక్టర్లు చెప్పారు. కానీ జట్టును ఎంపిక చేసినరోజే అతడు ప్యాడ్లు కట్టుకొని నెట్స్లో సిక్సర్లు బాదేస్తున్న వీడియోను ముంబై ఇండియన్స్ ట్విటర్లో పోస్ట్ చేయడం అనుమానాలకు తావిచ్చింది. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా టాస్కు వచ్చినప్పుడు రోహిత్, కోహ్లీ కనీసం ఒకరి ముఖాల్లోకి ఒకరు చూసుకోలేదు. ఎడమొహం పెడమొహంగా కనిపించిన వీడియో వైరల్గా మారింది. ఇవన్నీ వీరి మధ్య విభేదాల వార్తలకు బలం చేకూర్చింది. అంతేకాకుండా ఈ ప్రచారంపై వీరు మౌనంగా ఉండటం కూడా నమ్మేలా చేసింది.
ఇక ఐపీఎల్ 2021 ముందు ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్తో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య ఉన్న విభేదాలకు తెరపడింది. ఇద్దరు మ్యాచ్ పరిస్థితులపై పదే పదే చర్చించుకోవడం చర్చనీయాంశమైంది. అంతేకాకుండా విజయానంతరం వీరిద్దరు ఒకరినొకరు కౌగిలించుకోవడం చూస్తే వీరి మధ్య ఎలాంటి విభేధాల్లేవని విషయం స్పష్టమైంది. భారత్, న్యూజిలాండ్ మధ్య సౌథాంప్టన్ వేదికగా ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుండగా.. మంగళవారం స్లిప్లో రోహిత్, కోహ్లీ ఫీల్డింగ్ చేశారు. ఆ సమయంలో కోహ్లీ తెగ ఉత్సాహంగా కనిపించాడు. కోహ్లీ అత్యుత్సాహం రోహిత్కి కోపం తెప్పించినట్లు తెలుస్తోంది. వాతావరణం చల్లగా ఉండడంతో వార్మప్తో శరీరం ఉష్ణోగ్రతని పెంచుకునేందుకు కోహ్లీ ప్రయత్నించాడు. ఈ క్రమంలో కోహ్లీ చేష్టలకి రోహిత్ అసహనం వ్యక్తం చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అయింది. దీంతో వార్ మళ్లీ మొదలైందా? అంటూ నెటిజన్లు చెవులుకొరుకుంటున్నారు.