నాలుగో వికెట్కు 137 పరుగులు
ధోనీతో కలిసి నాలుగో వికెట్కు 137 పరుగులు జోడించిన రోహిత్ శర్మ చివరి వరకు క్రీజులో ఉండి విజయం కోసం పోరాడాడు. ఓ ఎండ్లో వరుసగా వికెట్లు పడుతున్నప్పటికీ... ఆచితూచి ఆడుతూ పరుగుల వరద పారించాడు. వరుసగా పదో సిరీస్లో సెంచరీ చేసిన రోహిత్ శర్మ వన్డేల్లో 22వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అత్యధిక సెంచరీలు బాదిన విదేశీ క్రికెటర్గా
దీంతో ఆసీస్ గడ్డపై వన్డేల్లో అత్యధిక సెంచరీలు బాదిన విదేశీ క్రికెటర్గా నిలిచాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ మూడు సెంచరీల రికార్డుని అధిగమించాడు. అయితే, రోహిత్ శర్మ ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీలు సాధించిన నాలుగు వన్డేల్లోనూ భారత్ జట్టు పరాజయాన్ని చవిచూసింది.
నాలుగు వన్డేల్లోనూ ఓటమిపై
తాజాగా ఈ రికార్డుని రోహిత్ ముందు ప్రస్తావించగా "దురదృష్టవశాత్తు ఆస్ట్రేలియాలో నేను సెంచరీ సాధించిన నాలుగు వన్డేల్లోనూ భారత్ జట్టు ఓడిపోయింది. ఈ అపవాదుని తొందరలోనే చెరిపేయాలని నేను ఆశిస్తున్నా. ఈసారి సెంచరీ సాధించడంతో పాటు టీమిండియాని గెలిపిస్తా" అని రోహిత్ శర్మ ధీమా వ్యక్తం చేశాడు.
నాలుగుసార్లూ భారత్ ఓటమి
2015లో మెల్బోర్న్ వేదికగా జరిగిన వన్డేలో 138 పరుగులు చేసిన రోహిత్.. ఆ తర్వాత 2016లో పెర్త్ వేదికగా జరిగిన రెండు వన్డేల్లో 171 నాటౌట్, 124 పరుగులు... శనివారం సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో 133 పరుగులు చేశాడు. అయితే రోహిత్ సెంచరీలు చేసిన ఈ నాలుగుసార్లూ భారత్ ఓడిపోయింది.
మంగళవారం అడిలైడ్ వేదికగా రెండో వన్డే
కాగా, మూడు వన్డేల సిరిస్లో భాగంగా అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో మంగళవారం రెండో వన్డే జరగనుండగా, ఆ తర్వాత శుక్రవారం మెల్బోర్న్ వేదికగా మూడో వన్డే జరగనుంది. ఆస్ట్రేలియా పర్యటన ముగిసిన తర్వాత జనవరి 23 నుంచి న్యూజిలాండ్ పర్యటనలో ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరీస్లో తలపడనుంది.