
యువ ఆటగాళ్లకు కొదవలేదు:
విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న 'హిట్మ్యాన్' రోహిత్ శర్మ స్వదేశంలో జరుగుతున్న శ్రీలంక టీ20 సిరీస్కు విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విశ్రాంతి సమయంను అతను కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. ఈ క్రమంలో తాజాగా రోహిత్ ఓ జాతీయ మీడియా సమావేశంలో మాట్లాడాడుతూ... 'టీమిండియా జట్టులో యువ ఆటగాళ్లకు కొదవలేదు. వచ్చే సిరీస్లలో వారు ప్రత్యేక ముద్ర వేయాలని ఆశిస్తున్నా. టీ20 ప్రపంచకప్ సమయానికి అంతా సెట్ అవుతుందని ఆశిస్తున్నా' అని అన్నాడు.

నాలుగో స్థానం అయ్యర్దే:
'ఇప్పటివరకూ కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, శివం దూబేలు కలిసి ఆడిన మ్యాచ్లు చాలా తక్కువ. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. వీరంతా జట్టుగా ఆడుతున్న సమయంలో వారు మరింత ఆత్మవిశ్వాసాన్ని సొంతం చేసుకోవం ఖాయం. భారత క్రికెట్ జట్టులో పరిస్థితులు మారాయి. నాలుగో స్థానంలో అయ్యర్ బాగా ఆడుతున్నాడు. ఆ స్థానంలో అతడు చాలాకాలం ఆడే అవకాశం ఉంది. అయ్యర్ మంచి ఆత్మవిశ్వాసంతో కన్పిస్తున్నాడు. పరిస్థితుల్ని బట్టి గేమ్ను అర్థం చేసుకుంటూ ఆడుతున్నాడు. ఆ స్థానం అయ్యర్దే' అని రోహిత్ పేర్కొన్నాడు.

మిగతావారు మీ స్థానాలు వెతుక్కోండి:
'పంత్ వెస్టిండీస్ సిరీస్లో బాగా ఆడాడు. దూబే అరంగేట్రంలోనే ఆకట్టుకుంటున్నాడు. రాబోయే సంవత్సరాలలో నాలుగో స్థానంలో అయ్యరే వస్తాడు. మిగతా వారు ఏయే స్థానాల్లో సెట్ అవుతారో వెతుక్కోవాలి. రాహుల్ ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. జట్టుకు అవసరమైన మంచి ఇన్నింగ్స్లు ఆడుతున్నాడు. ఇలానే ఆడాలని కోరుకుంటున్నా. రెండు-మూడు మ్యాచ్ల్లో ఈ యువ ఆటగాళ్లపై అంచనాకు రాలేం' అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

ముంబై ఆటగాళ్లకు సూచనలు:
ఆదివారం బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) మైదానంలో ప్రాక్టీస్ చేసేందుకు రోహిత్ వచ్చాడు. ఈ సమయంలో రంజీ టోర్నీలో వరుస ఓటములను ఎదుర్కొంటున్న ముంబై జట్టు గట్టెక్కేందుకు ఆటగాళ్లకు సూచనలు చేశాడట. ముంబై కోచ్ వినాయక్ సమంత్, బౌలింగ్ కోచ్ ప్రదీప్ సుందరం, జట్టు మేనేజర్ అజింక్య నాయక్ సైతం రోహిత్ మాట్లాడే సందర్భంలో అక్కడే ఉన్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications












