వెస్టిండీస్ వేదికగా ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ను భారత్ గెలిచిన సంగతి తెలిసిందే. 13 ఏళ్ల ప్రపంచకప్ నిరీక్షణకు తెరదించుతూ రోహిత్ సేన ట్రోఫీని ముద్దాడింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో సౌతాఫ్రికాపై ఏడు పరుగుల తేడాతో గెలిచి భారత్ ఛాంపియన్గా నిలిచింది. అయితే టీమిండియా ట్రోఫీని సాధించడంలో వికెట్ కీపర్ రిషభ్ పంత్ తెలివితేటలు ఎంతో కీలకపాత్ర పోషించాయని, కప్ గెలవడానికి అదో కారణమని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.
పంత్ తన తెలివితేటలతో మ్యాచ్ను ములుపుతిప్పాడని, లేదంటే ఆ సమయంలో జోరు మీదున్న సౌతాఫ్రికా మ్యాచ్ను ముగించేదని రోహిత్ పేర్కొన్నాడు. ఓ ప్రముఖ షోలో పాల్గొన్న రోహిత్ శర్మ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు. ''సౌతాఫ్రికా విజయానికి 24 బంతుల్లో 26 పరుగులు అవసరం. అప్పుడో విరామం వచ్చింది. పంత్ తన తెలివితేటలు ఉపయోగించి మ్యాచ్ను ఆపాడు. పంత్ మోకాలికి గాయమైంది. తన మోకాలికి పట్టీ వేయించుకునే కారణంతో మ్యాచ్ను స్లోడౌన్ చేశాడు''

''ఆ సమయంలో మ్యాచ్ చాలా వేగంగా వెళ్తోంది. బౌలర్ వెంటనే బంతులు వేస్తే చెలరేగిపోవడానికి బ్యాటర్లు సిద్ధంగా ఉన్నారు. అయితే పంత్ అకస్మాతుగా పడిపోయాడు. ఫిజియోథెరపిస్ట్ వచ్చి పంత్ మోకాలికి పట్టీ చూట్టాడు. పంత్ కారణంగా వచ్చిన బ్రేక్తో సౌతాఫ్రికా లయను దెబ్బతీశాం. బౌలర్లతో మాట్లాడి ఫీల్డింగ్ సెట్ చేశాను. గేమ్ స్లోడౌన్ అయ్యింది''
''మ్యాచ్ గెలవడానికి ఇదే ప్రధాన కారణమని అని నేను చెప్పట్లేదు. కానీ విజయానికి కారణాలలో ఇదీ ఒకటి. పంత్ తన తెలివితేటలతో మ్యాచ్ను మాకు అనుకూలంగా మార్చేశాడు'' అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికా విజయానికి 36 బంతుల్లో 54 పరుగులు అవసరం. ఈ సందర్భంలో 15వ ఓవర్ వేసిన అక్షర్ పటేల్ బౌలింగ్ హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసం సృష్టించడంతో 24 పరుగులు వచ్చాయి. తర్వాత ఓవర్ బుమ్రా వచ్చి కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సౌతాఫ్రికా గెలుపుకు 24 బంతుల్లో 26 పరుగులు అవసరమయ్యాయి.
అయితే ఈ స్థితిలో పంత్ తెలివిగా వ్యవహరించాడు. బుమ్రా రాకతో నెమ్మదించిన క్లాసెన్ మూమెంట్ను మరింతగా స్లోడౌన్ చేయాలనుకున్నాడు. మోకాలి నొప్పి అంటూ ఆటను కాసేపు ఆపేశాడు. బ్యాండేజ్ వేసుకోవడంతో మ్యాచ్ ఆలస్యమైంది. మరోవైపు విరామం రావడంతో జోరు మీదున్న దక్షిణాఫ్రికా బ్యాటర్లు లయ తప్పారు. బ్రేక్ అనంతరం హార్దిక్ వేసిన తొలి బంతికే క్లాసెన్ ఔటయ్యాడు.