
ముంబై: భారత క్రికెట్ జట్టు తరఫున 24 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్. టెస్టులు (200 మ్యాచ్లు-15,921 పరుగులు), వన్డేల్లో (463 మ్యాచ్లు-18,426 పరుగులు) అత్యధిక పరుగుల ఘనతలు సహా ఎన్నో ప్రపంచ రికార్డులు తిరగరాశాడు. 2013 నవంబరు 16న అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తూనే.. దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారత రత్న'ను అందుకున్నాడు. సచిన్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా మాజీ, ప్రస్తుత ఆటగాళ్లు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు చెప్పారు.
ఈ క్రమంలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ కూడా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్కు తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపాడు. టీమిండియాకు ఎన్నో విజయాలు సాధించిన సచిన్ మున్ముందు కూడా ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు రోహిత్ పేర్కొన్నాడు. అంతేకాకుండా సచిన్తో తన అనుబంధాన్ని హిట్మ్యాన్ గుర్తుచేసుకున్నాడు. సచిన్తో ఐదు అద్భుత అనుభవాలను అభిమానులతో పంచుకున్నాడు.
'సచిన్ పాజీ పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీకు ఈ రోజు గొప్పగా సాగాలని ఆశిస్తున్నా. మీతో పంచుకున్న ఐదు అద్భుత అనుభవాలు ఇవి రోహిత్ ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు.
1. ఆస్ట్రేలియాతో సీబీ సిరీస్ తొలి ఫైనల్లో మ్యాచ్ను గెలిపించిన భాగస్వామ్యం.
2. ఈడెన్ గార్డెన్స్ వేదికగా సచిన్ నుంచి టెస్టు క్యాప్ అందుకోవడం.
3. ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ ట్రోఫీ, చాంపియన్స్ లీగ్ ట్రోఫీ చేజిక్కించుకోవడం.
4. మాస్టర్ కెరీర్ చివర్లో ఆడిన 199, 200వ టెస్టులో నేనూ భాగస్వామిని కావడం.
5. క్రికెట్ దేవుడు శతకాల శతకం చేయడాన్ని కళ్లారా చూడటం అని రోహిత్ పేర్కొన్నాడు.
రెండు దశాబ్దాల పాటు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన మాస్టర్.. తన బ్యాటింగ్తో ఎన్నో రికార్డులు కొల్లగొట్టాడు. తన రిటైర్మెంట్ ప్రకటించి ఏడేళ్లు గడుస్తున్నా ఇంకా సచిన్ పేరు మీద చాలా రికార్డులు ఉండిపోయాయి. ప్రధానంగా వన్డేల్లో, టెస్టుల్లో అత్యధిక సెంచరీల రికార్డుతో పాటు అంతర్జాతీయ క్రికెట్లో మోస్ట్ సెంచరీల ఘనత కూడా సచిన్ పేరు మీద ఇంకా అలానే ఉంది. సచిన్ భారత్ తరఫున 200 టెస్టులు, 463 వన్డేలు, ఒక టీ20 ఆడాడు.