హైదరాబాద్: టీమిండియా బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ సాధారణ వైద్య పరీక్షల కోసం భారత్కు వచ్చాడు. గత నవంబర్లో రోహిత్ శర్మ తొడకు శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించి పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈ పరీక్షల కోసం అతడు లంక పర్యటన మధ్యలో స్వదేశానికి వచ్చాడు.
వైద్య పరీక్షల అనంతరం రోహిత్ శర్మ శుక్రవారం (ఆగస్టు 4) రాత్రికి జట్టులో చేరనున్నాడు. ఈ మేరకు బీసీసీఐ గురువారం అధికారిక ప్రకటన చేసింది. "ఇటీవల జరిగిన సర్జరీ అనంతరం మెడికల్ చెకప్ కోసం రోహిత్ శర్మ శ్రీలంక పర్యటన నుంచి స్వదేశానికి వెళ్తాడు" అని బీసీసీఐ అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.

అయితే రోహిత్ శర్మ ఫిట్నెస్ విషయంలో ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదని కూడా ఆయన అన్నారు. మూడు టెస్టు మ్యాచ్లు, ఐదు వన్డేలు, ఒక టీ20 కోసం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా శ్రీలంక పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే.
గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య శ్రీలంకపై 304 పరుగుల తేడాతో కోహ్లీ సేన ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక, కొలంబో వేదికగా గురువారం నుంచి రెండో టెస్టు ప్రారంభమైంది. రెండో టెస్టులో టీమిండియా భారీ స్కోరు సాధించింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్ను 9 వికెట్లు కోల్పోయి 622 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.
దీంతో రెండో టెస్టులో కూడా టీమిండియా పట్టు బిగించినట్లు అయింది. పుజారా (133), రహానే (132) సెంచరీలు చేయగా, జడేజా (70 నాటౌట్), సాహా (67), కేఎల్ రాహుల్ (57), అశ్విన్ (54)లు హాఫ్ సెంచరీలు చేశారు. గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో 600 పరుగులు చేసిన కోహ్లీసేన ఇప్పుడు ఆ స్కోరుని అధిగమించింది. లంక బౌలర్లలో హెరాత్ 4, పుష్పకుమార 2 వికెట్లు తీసుకున్నారు.