భారత క్రికెట్లో ప్రస్తుతం రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించిన విషయం పెద్ద దుమారం రేపుతోంది. ఆస్ట్రేలియా పర్యటన కోసం జట్టును ప్రకటించినప్పుడు సెలెక్టర్లు అనూహ్యంగా శుభ్మన్ గిల్ను వన్డే కెప్టెన్గా నియమించారు. దీంతో విజయవంతమైన రోహిత్ శర్మ కెప్టెన్సీ శకం ముగిసింది. ఈ కీలక నిర్ణయం వెనుక జరిగిన కమ్యూనికేషన్పై రోహిత్ సన్నిహితుడు, మాజీ భారత క్రికెటర్ అభిషేక్ నాయర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కేవలం 'ఒక ఫోన్ కాల్ సరిపోదు': నాయర్ అభిప్రాయం
హిట్ మ్యాన్ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై అభిషేక్ నాయర్ స్పందిస్తూ.. బీసీసీఐ, సెలక్షన్ కమిటీ తమ భవిష్యత్ ప్రణాళికలను రోహిత్ శర్మకు పూర్తిగా వివరించి ఉండాలని అన్నారు. రోహిత్ కూడా జట్టు యాజమాన్యం ఆలోచనతో ఏకీభవించినట్లయితే.. కెప్టెన్సీ మార్పు గురించి ఎలాంటి సమస్య ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఈ కీలకమైన చర్చ కేవలం ఒక ఫోన్ కాల్తో ముగిసేది కాదని అభిషేక్ నాయర్ స్పష్టం చేశారు. ఈ విషయానికి సంబంధించి కమ్యూనికేషన్ ప్రక్రియకు సమయం పడుతుందని.. ఇది అన్ని పక్షాల మధ్య విస్తృతమైన చర్చ ద్వారానే జరగాలని తాను ఆశిస్తున్నట్లు వెల్లడించారు.

అభిషేక్ నాయర్ మాటల్లోని ముఖ్య సారాంశం
"రోహిత్ శర్మతో చర్చ జరిగి, అందరూ ఒకే దిశలో ఆలోచిస్తున్నంత వరకు... సమస్య లేదు. ఈ మార్పు కేవలం ఒక ఫోన్ కాల్తో అయ్యేది కాదు, దీనికి సమయం పడుతుంది.శుభ్మన్ గిల్కు అవకాశం ఇవ్వాలని జట్టు అనుకుంటే.. గిల్కు సహాయం చేయడానికి నేను డ్రెస్సింగ్ రూమ్లో ఉంటానని రోహిత్ కూడా స్వయంగా అంగీకరించి ఉండాలి. రోహిత్ను లూప్లో ఉంచి.. మీరు ఇప్పటివరకు చేసినట్లుగానే, ఈ జట్టును ముందుకు నడిపించడానికి మాకు సహాయం చేయండని బాధ్యతను ఇస్తే, ఇది గొప్ప నిర్ణయం అవుతుంది." అని అభిషేక్ నాయర్ పేర్కొన్నారు.
రోహిత్ భవిష్యత్తుపై ప్రశ్నలు
కెప్టెన్సీ తొలగింపు నిర్ణయం తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ భవిష్యత్తుపై పెద్ద ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2027 వన్డే ప్రపంచ కప్లో ఆడాలని రోహిత్ లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. కెప్టెన్సీ కోల్పోవడంతో ఇకపై తన ఆటతోనే జట్టులో తన స్థానాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్ కీలక టోర్నమెంట్ల కోసం టీమ్ మేనేజ్మెంట్ ప్రణాళికల గురించి స్పష్టంగా వెల్లడించలేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల భవిష్యత్తుపై సందిగ్ధత కొనసాగుతోంది. అయితే తన స్నేహితుడు రోహిత్ ప్రపంచ కప్ సన్నాహాలు ఇప్పటికే పూర్తి చేసుకున్నారని అభిషేక్ నాయర్ ధీమా వ్యక్తం చేశారు.