వన్డే వరల్డ్ కప్-2023లో ఆద్యంతం విజయాలతో హోరెత్తించిన భారత్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలై ట్రోఫీని చేజార్చుకుంది. ఆ ఓటమి ఆటగాళ్లతో పాటు కోట్లాది టీమిండియా అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి స్టార్లకు అదే ఆఖరి వన్డే ప్రపంచకప్ అయ్యే అవకాశం ఉండటంతో అభిమానులకు బాధ రెట్టింపు అయ్యింది.
అయితే ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్లో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. గత మెగాటోర్నీలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకొని ఛాంపియన్గా అవతరించింది. కాగా, టీ20 ప్రపంచకప్ గెలవడంతో తనకు మళ్లీ బతికినట్లు అనిపించిందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. తన క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవంలో రోహిత్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

వన్డే వరల్డ్ కప్ ఓటమి బాధను టీ20 వరల్డ్ కప్ పోగొట్టిందని రోహిత్ అన్నాడు. పొట్టి కప్ కోసం మూడు నుంచి నాలుగు నెలలు తీవ్రంగా శ్రమించామని, అంతిమంగా ఫలితం దక్కిందని పేర్కొన్నాడు. ''ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ గెలవడాన్ని లక్ష్యంగా పెట్టుకుని 3-4 నెలలు తీవ్రంగా కష్టపడ్డాం. ఫలితం దక్కింది. ఆ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత నాకు మళ్లీ బతికినట్లు అనిపించింది. ఇక మేం మొదలుపెట్టిన అకాడమీ నుంచి యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా వంటి క్రికెటర్లు రావాలని కోరుకుంటున్నా'' రోహిత్ తెలిపాడు.
కాగా, టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత పొట్టి ఫార్మాట్కు రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. రోహిత్తో పాటు విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా కూడా టీ20లకు గుడ్బై పలికారు. ప్రస్తుతం రోహిత్ వన్డే, టెస్టుల్లో భారత జట్టుకు సారథి బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, జూన్లో జరగనున్నవరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్లో విజేతగా నిలవాలనే లక్ష్యంతో రోహిత్ శ్రమిస్తున్నాడు.