
లండన్: భారత క్రికెట్ జట్టు కేప్టెన్ రోహిత్ శర్మ కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఐసొలేషన్ నుంచి బయటికొచ్చారు. బర్మింగ్హామ్ టెస్ట్ మ్యాచ్ ఆరంభం కావడానికి కొద్దిరోజుల ముందే ఆయనకు కోవిడ్ సోకింది. లీసెస్టర్షైర్తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఆయన కరోనా వైరస్ పాజిటివ్గా తేలారు. రెండో ఇన్నింగ్లో బ్యాటింగ్కు కూడా దిగలేదు హిట్ మ్యాన్. తాను బస చేసిన హోటల్లోనే ఐసొలేషన్లోకి వెళ్లారు.
ఇప్పుడాయన ఈ మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. పూర్తి ఫిట్నెస్తో ఉన్నారు. ఐసొలేషన్ నుంచి బయటికి వచ్చారు. లీసెస్టర్ నుంచి బర్మింగ్హామ్ ఎడ్జ్బాస్టన్కు బయలుదేరారు. కొద్దిసేపటి కిందటే ఆయన జట్టు ప్లేయర్లను కలుసుకొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. టీమిండియా ఆడబోయే తరువాతి మ్యాచ్లకు రోహిత్ శర్మ అందుబాటులో ఉండటం ఖాయమైంది.
ఈ నెల 7వ తేదీన తొలి టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ను ఢీ కొట్టబోయే జట్టు..రోహిత్ శర్మ కేప్టెన్గా ఉండబోతోన్నాడు. ఈ మ్యాచ్ అనంతరం భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య టీ20 సిరీస్ ఆరంభమౌతుంది. మూడు మ్యాచ్ల సిరీస్ ఇది. తొలి మ్యాచ్ ఈ నెల 7వ తేదీన షెడ్యూల్ అయింది. సౌథాంప్టన్లోని ఏజెస్ బౌల్ స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. 9, 10వ తేదీల్లో ఎడ్జ్బాస్టన్, ట్రెంట్ బ్రిడ్జ్ల్లో మిగిలిన రెండు టీ20 ఇంటర్నేషనల్స్ ఉంటాయి.
తొలి టీ20 మ్యాచ్ కోసం బీసీసీఐ ఇప్పటికే జట్టును ప్రకటించింది కూడా. దీనికి రోహిత్ శర్మ కేప్టెన్. ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ సెలెక్ట్ అయ్యారు.