టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుకు అతిచేరువలో నిలిచాడు. ఇవాళ ఇండోర్ వేదికగా అఫ్గానిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్తో రోహిత్ చరిత్ర సృష్టించనున్నాడు. 150 అంతర్జాతీయ టీ20లు ఆడిన తొలి ప్లేయర్గా రోహిత్ రికార్డులకెక్కనున్నాడు. 2007లో భారత్ తరపున అరంగేట్రం చేసిన హిట్ మ్యాన్ ఇప్పటివరకు 149 టీ20 మ్యాచ్లు ఆడాడు.
అంతర్జాతీయ టీ20లు ఆడిన ప్లేయర్లలో రోహిత్ తర్వాతి స్థానంలో ఐర్లాండ్ ఆటగాడు స్టిర్లింగ్ ఉన్నాడు. స్టిర్లింగ్ 134 మ్యాచ్లు ఆడాడు. అత్యధిక టీ20లు ఆడిన జాబితాలో మరో ఐర్లాండ్ ప్లేయర్ డాకర్లెల్ (128), పాకిస్థాన్ బ్యాటర్ షోయబ్ మాలిక్ (124), న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ (122) మూడు, నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్నారు. 2010లో టీ20ల్లో అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లి ఇప్పటివరకు 115 మ్యాచ్లు ఆడాడు.

అయితే రోహిత్ శర్మకు మరికొన్ని అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. అఫ్గానిస్థాన్ సిరీస్ను భారత్ క్లీన్స్వీప్ చేస్తే టీ20ల్లో విజయవంతమైన కెప్టెన్గా రోహిత్ రికార్డులకెక్కుతాడు. ఇప్పటివరకు 52 మ్యాచ్లకు టీమిండియా సారథి బాధ్యతలు అందుకున్న రోహిత్ శర్మ 40 మ్యాచ్ల్లో జట్టును గెలిపించాడు.
ప్రస్తుతం అత్యధిక టీ20 విజయాలు సాధించిన కెప్టెన్గా టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో సహా అయిదుగురు పేరిట ఉంది. ధోనీ, అస్గర్ (అఫ్గానిస్థాన్), బాబర్ అజామ్ (పాకిస్థాన్), ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లాండ్), బ్రెయిన్ మసబా (ఉగాండ) సారథ్యంలో తమ జట్లు 42 మ్యాచ్ల్లో విజయం సాధించాయి.
హిట్ మ్యాన్ మరో 44 పరుగులు సాధిస్తే టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన టీమిండియా కెప్టెన్గా రికార్డు నెలకొల్పుతాడు. మరోవైపు రోహిత్ మరో రికార్డుకు 147 పరుగుల దూరంలో నిలిచాడు. ఈ రన్స్ను సాధిస్తే నాలుగు వేల పరుగుల మార్క్ను అందుకున్న రెండో భారత ప్లేయర్గా రోహిత్ రికార్డు సాధిస్తాడు. భారత్ తరపున విరాట్ కోహ్లి మాత్రమే ఇప్పటివరకు ఈ ఘనత అందుకున్నాడు.