బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా ఆటగాళ్ల మధ్య ఇప్పటికే స్లెడ్జింగ్ కొనసాగుతోంది. ఆసీస్ ఒక మాటంటే మేం పది మాటలు అంటాం అన్నట్లుగా భారత్ కూడా దూకుడుగా వ్యవహరిస్తోంది. అసలే ఆస్ట్రేలియా గత చరిత్ర తెలిసిన టీమిండియా సీనియర్లు అయితే అస్సలు వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో సిడ్నీలో జరుగుతున్న ఐదో టెస్టులోనూ ఆసక్తికర సన్నివేశాలు కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో నిన్న తొలిరోజు ఆట ముగిసే సమయంలో బుమ్రా-కోన్ స్టాస్ మధ్య గొడవ చోటు చేసుకుంది.
భారత బౌలర్, కెప్టెన్ కూడా అయిన జస్ ప్రీత్ బుమ్రా చివరి ఓవర్ వేస్తున్నాడు. దీంతో అతన్ని రెచ్చగొట్టేలా ఆసీస్ ఓపెనర్ శామ్ కోన్ స్టాస్ సంజ్ఞలు చేశాడు. అయితే బుమ్రా వెంటనే రెచ్చిపోలేదు. క్రీజులో ఉన్న మరో బ్యాట్స్ మెన్ ఉస్మాన్ ఖవాజాను తన పదునైన బంతితో వెనక్కి పంపిన బుమ్రా.. వెంటనే వెనక్కి తిరిగి బౌలర్ ఎండ్ లో ఉన్న కోన్ స్టాస్ మీదకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. చివరికి ఏమనుకున్నాడో వెనక్కి తగ్గాడు. దీంతో బుమ్రా-కోన్ స్టాస్ హావభావాలు చర్చనీయాంశమయ్యాయి.

దీనిపై తాజాగా టీమిండియా రెగ్యులర్ కెప్టెన్, సిడ్నీ టెస్టులో ఆడని రోహిత్ శర్మ స్పందించాడు. అనవసరంగా వెటకారాలు చేయడం టీమిండియా ఆటగాళ్లకు అలవాటులేదని వ్యాఖ్యానించాడు. తమ ఆటగాళ్లు ఎప్పుడూ సైలెంట్ గా ఉంటూ తమ ఆట తాము ఆడుకుంటారని, కానీ ప్రత్యర్థులు పదే పదే రెచ్చగొడుతుంటే మాత్రం అలా ఊరుకోరన్నాడు. భారత క్రికెటర్ల వ్యవహారశైలి క్లాస్ గా ఉంటుందని, మైదానంలో వారి ఫోకస్ ఎప్పుడూ ఆటమీదే ఉంటుందన్నారు.
తమ కుర్రవాళ్లు ప్రశాంతంగా ఉన్నంతసేపూ అలా ఉంటారు. వారిని కెలుకుతుంటే మాత్రం ప్రశాంతంగా ఉండరని రోహిత్ శర్మ తేల్చిచెప్పేశాడు. అయితే అనవసరమైన వెటకారాలు మాత్రం వారికి సరిపోవన్నారు. అలాగే బుమ్రా క్లాస్ ఆటగాడని రోహిత్ ప్రశంసలు కురిపించాడు. తన ఆటతీరుతో బుమ్రా బౌలింగ్ లో ప్రమాణాలు నెలకొల్పాడని, అతన్ని 2013 నుంచి చూస్తున్నానని రోహిత్ తెలిపాడు. అతని గ్రాఫ్ ఎప్పటికప్పుడూ పెరుగుతూ వస్తోందన్నాడు.