
హైదరాబాద్: 2008లో ఐపీఎల్ ప్రారంభం కాగా.. ప్రతి లీప్ సంవత్సరంలో ఓ కొత్త జట్టు ఛాంపియన్ అవుతోంది. 2008లో రాజస్థాన్ రాయల్స్.. 2012లో కోల్కతా నైట్ రైడర్స్.. 2016లో సన్రైజర్స్ హైదరాబాద్ కప్ కొట్టింది. ఈ ట్రెండ్ ప్రకారం 2020లోనూ కొత్త ఛాంపియన్ వస్తుందని అందరూ అంచనా వేశారు. కానీ అందరిని అంచనాలను, అపోహలను కొట్టివేస్తూ ముంబై ఇండియన్స్ ఐపీఎల్లో ఐదోసారి టైటిల్ ఎగరేసుకుపోయింది. బేసి సంవత్సరం, సరి సంవత్సరం, లీప్ సంవత్సరం, మహమ్మారి సంవత్సరం ఇలా ఏడాది ఏదైనా.. విజయం మాత్రం మాదేనని ముంబై నిరూపించింది. అయితే ముంబై విజయంపై ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ట్విటర్ వేదికగా సరదాగా స్పందించాడు.
ముంబై ఇండియన్స్ గతంలో 2013, 2015, 2017, 2019 బేసి సంఖ్య సంవత్సరాల్లోనే నాలుగుసార్లు టైటిల్ గెలిచింది. దీంతో ముంబై జట్టు బేసి సంఖ్య సంవత్సరాల్లోనే టైటిల్ గెలుస్తుందనే అభిప్రాయం అభిమానుల్లో బలంగా నాటుకుపోయింది. అందుకు సంబంధించిన ఒక యాడ్ కూడా గత మార్చిలో లాక్డౌన్కు ముందు విడుదల చేశారు. అందులో నిద్రపోతున్న రోహిత్ శర్మను ఒకతను మేల్కొలిపి ముంబై విజయంపై సరి-బేసి అపోహలను గుర్తుచేస్తాడు. అలాగే అతని జెర్సీ నంబర్ కూడా 45ని 46గా మార్చికుంటే బాగుంటుందని ఓ సలహా ఇస్తాడు.
దానికి స్పందించిన రోహిత్ శర్మ ముంబై విజయానికి బేసి సంఖ్యే అవసరమైతే.. ఈ ఏడాది కూడా తమకు కలిసి వస్తుందంటాడు. దానికి వివరణ కూడా ఇస్తాడు. ఇది కేవలం ఐపీఎల్ 2020 మాత్రమే కాదు.. ఇది ఐపీఎల్ 13వ సీజన్ కూడా అని చెపుతాడు. ఈ యాడ్ విడుదలైన కొద్ది రోజులకే కరోనా పరిస్థితుల ప్రభావంతో లాక్డౌన్ విధించగా.. మార్చి 29న ప్రారంభంకావాల్సిన లీగ్ ఆరు నెలలు వాయిదా పడింది. చివరికి యూఏఈలో సెప్టెంబర్ 19న ప్రారంభమైంది. అక్కడ ముంబై దుమ్ములేపింది.
గత మంగళవారం రాత్రి దుబాయ్ వేదికగా ముగిసిన ఐపీఎల్ 2020 ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్పై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఏకంగా ఐదుసార్లు టైటిల్ నెగ్గి చరిత్ర సృష్టించింది. అంతేకాదు ఆ జట్టు విజయాలపై ఉన్న అపోహలను తొలగించుకుంది. దాంతో రోహిత్ ఆ పాత యాడ్ను తన ట్విటర్లో పోస్టు చేసి.. ఈసారి తాము విజేతగా గెలిచి చూపించామని స్పష్టం చేశాడు.