దక్షిణాఫ్రికాపై జరిగిన నిర్ణయాత్మక చివరి వన్డేలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తూ కీలకమైన అర్థ సెంచరీ సాధించాడు. ఆస్ట్రేలియా పర్యటనతో అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి వచ్చినప్పటి నుంచి రోహిత్ 5 మ్యాచ్లలో ఒక సెంచరీ, మూడు అర్థ సెంచరీలు సాధించాడు. 271 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన భారత్ 9 వికెట్ల తేడాతో సులభంగా విజయం సాధించింది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ 75 పరుగులు చేయగా.. యశస్వి జైస్వాల్ అద్భుతమైన 116 పరుగులు చేసి భారత్కు టాప్ స్కోరర్గా నిలిచాడు. విరాట్ కోహ్లీ కూడా 65 పరుగులతో నాటౌట్గా నిలిచి భారత విజయాన్ని సులభతరం చేశాడు.
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
పుల్ షాట్లలో తిరుగులేని రికార్డు: గేమ్లో బెస్ట్ పుల్ షాట్ ఆడే ఆటగాళ్లలో రోహిత్ శర్మ ఒకడు. షార్ట్ బాల్ను బౌండరీకి పంపడాన్ని రోహిత్ శర్మ అస్సలు మిస్ చేయడు. వన్డేల్లో పుల్ షాట్ల ద్వారా సిక్సర్లు కొట్టే విషయంలో రోహిత్ శర్మకు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. బాల్-బై-బాల్ డేటా అందుబాటులో ఉన్న మ్యాచ్లలో రోహిత్ శర్మ పుల్ షాట్ల ద్వారా 114 సిక్సర్లు కొట్టాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న క్రిస్ గేల్(48 సిక్సర్లు) కంటే ఇది చాలా ఎక్కువ.

అంతర్జాతీయ సిక్సర్ల రికార్డు
రోహిత్ శర్మ ఇప్పటికే వన్డేల్లో అత్యధిక సిక్సర్ల జాబితాలో ముందున్నాడు. ఇటీవల షాహిద్ అఫ్రిది రికార్డును బద్ధలు కొట్టాడు. వన్డేల్లో రోహిత్ ఖాతాలో 354 సిక్సర్లు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్లో 600 కంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన ప్రపంచంలో ఏకైక ఆటగాడు కూడా రోహిత్ శర్మనే కావడం గమనార్హం. 75 పరుగుల ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో 20,000 పరుగుల మార్కును కూడా దాటాడు. ఈ ఘనత సాధించిన భారత బ్యాటర్ల ఎలైట్ జాబితాలో విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ వంటి ఆటగాళ్లతో రోహిత్ శర్మ చేరాడు.
రో-కో మళ్లీ ఎప్పుడు బరిలోకి దిగుతారు?
టీమిండియా తమ తదుపరి వన్డే సిరీస్ స్వదేశంలో న్యూజిలాండ్తో ప్రారంభించడానికి చాలా సమయం ఉంది. ఈ సిరీస్ జనవరి 11న ప్రారంభమవుతుంది. దీంతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఒక నెల కంటే ఎక్కువ కాలం అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉండనున్నారు. అయితే ఈ సీనియర్ ఆటగాళ్లు వరుసగా ఢిల్లీ, ముంబై తరఫున విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొంటారు. రోహిత్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నాకౌట్ మ్యాచ్లు కూడా ఆడతాడని సమాచారం.