గత కొన్నిరోజులుగా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ గురించే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముంబయి ఇండియన్స్ రోహిత్ను కాదని ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యను కెప్టెన్గా నియమించడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో రోహిత్కు మద్దతు ఇస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరికొంతమంది ఫ్యాన్స్ ముంబయి ఇండియన్స్ను అన్ ఫాలో చేస్తున్నారు.
అయితే గుజరాత్ టైటాన్స్ నుంచి బదిలీ చేసుకున్న హార్దిక్ పాండ్య ఎప్పటికైనా ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అవుతాడని అందరూ భావించారు. కానీ వచ్చే సీజన్ నుంచే రోహిత్ను తప్పించి, హార్దిక్కు సారథి బాధ్యతలు ఇవ్వడమే చర్చనీయాంశంగా మారింది. అయితే ఇటీవల వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓటమిపాలై రన్నరప్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తుదిపోరులో టీమిండియా గెలిచి ఉంటే భారత్కు వన్డే వరల్డ్ కప్ను అందించిన మూడో కెప్టెన్గా రోహిత్ నిలిచేవాడు. అయితే రోహిత్ వరల్డ్ కప్ గెలిచి ఉంటే ముంబయి ఇండియన్స్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి సాహసించేదా?

వన్డే వరల్డ్ కప్లో శ్రీలంక మ్యాచ్కు ముందు నిర్వహించిన ప్రెస్ మీట్లో రోహిత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. ''అన్ని మ్యాచ్లు వరుసగా గెలుస్తున్నాం కాబట్టి ప్రశంసిస్తున్నారు. కానీ ఒక మ్యాచ్లో ఓడిపోతే మీరే నన్ను మంచి కెప్టెన్ కాదని, చెత్త కెప్టెన్ అని అంటారు'' అని రోహిత్ అన్నాడు. హిట్మ్యాన్ చెప్పినట్టుగానే వరల్డ్ కప్లో ఓటమి అనంతరం హార్దిక్ ముంబయికి చేరడం, తర్వాత కెప్టెన్ను మార్చడం జరగడం గమనార్హం.
కాగా, రోహిత్కు ముంబయి తరపున 2024 సీజనే ఆఖరిదని వార్తలు వస్తున్నాయి.2025 సీజన్ ముందు మెగా వేలం ఉంటుంది. ప్రతి జట్టు నలుగురు ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో ముగ్గురు భారత ఆటగాళ్లకు మాత్రమే ఛాన్స్. ఈ నేపథ్యంలో ముంబయి హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్, బుమ్రాను అట్టిపెట్టుకుని రోహిత్ను వదిలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో మెగా వేలంలో రోహిత్ ఉంటాడని కథనాలు వస్తున్నాయి. కాగా, ఐపీఎల్ మినీ వేలం దుబాయ్ వేదికగా డిసెంబర్ 19న జరగనుంది.