టీ20 వరల్డ్ కప్లో హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగిన భారత్ హ్యాట్రిక్ విజయాలతో సూపర్-8 దశకు చేరుకుంది. బుధవారం నాసా కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. నిప్పులు చెరిగే బంతులతో విజృంభి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన అర్షదీప్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు.
మొదట బ్యాటింగ్ చేసిన అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 110 పరుగులు చేసింది. నితీశ్ కుమార్ (27; 23 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్), స్టీవెన్ టేలర్ (24; 30 బంతుల్లో, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్లు. అర్షదీప్ సింగ్ (4/9) నాలుగు, హార్దిక్ పాండ్య (2/14) రెండు, అక్షర్ పటేల్ (1/25) ఒక వికెట్ తీశారు. అనంతరం ఛేదనలో భారత్ 18.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది.

ఛేదన ఆరంభంలోనే స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి (గోల్డెన్ డకౌట్), రోహిత్ శర్మ (3; 6 బంతుల్లో) ఔటైనప్పటికీ సూర్యకుమార్ యాదవ్ (50 నాటౌట్, 49 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టును విజయతీరాలకు చేర్చాడు. శివమ్ దూబె (31 నాటౌట్; 35 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.అయితే ఈ క్రమంలో భారత సారథి రోహిత్ శర్మ అరుదైన రికార్డు సాధించాడు. ఐసీసీ మెగా టోర్నీల్లో భారత్ తరఫున అత్యధిక విజయాలు సాధించిన రెండో కెప్టెన్గా హిట్మ్యాన్ చరిత్రకెక్కాడు.
ఐసీసీ మెగా ఈవెంట్లలో భారత్ను అత్యధిక సార్లు గెలిపించిన కెప్లెన్ల జాబితాలో ఎంఎస్ ధోనీ అగ్రస్థానంలో ఉన్నాడు. ధోనీ 58 మ్యాచ్ల్లో 41 విజయాలు సాధించాడు. ఇక అమెరికా మ్యాచ్ కంటే ముందు రెండో స్థానంలో రోహిత్-దాదా ఉమ్మడిగా ఉన్నారు. తాజాగా యూఎస్ఏపై గెలవడంతో గంగూలీ రికార్డును హిట్మ్యాన్ బ్రేక్ చేశాడు. రోహిత్ 20 మ్యాచ్ల్లో 17, గంగూలీ 22 మ్యాచ్ల్లో 16 విజయాలు అందుకున్నారు. నాలుగో స్థానంలో ఉన్న విరాట్ కోహ్లి 19 మ్యాచ్ల్లో 13 సార్లు జట్టును గెలిపించాడు.