Rohit Sharma: టీమిండియా కెప్టెన్గా ఎన్నో కీలక టోర్నమెంట్లలో జట్టును గెలుపుతీరాలకు చేర్చిన రోహిత్ శర్మ ఆ బాధ్యత నుంచి తప్పుకున్నారు. ఆస్ట్రేలియా సిరీస్ కోసం శనివారం(అక్టోబర్ 4) ప్రకటించిన వన్డే జట్టుకు సెలెక్టర్లు శుభ్మన్ గిల్ను కెప్టెన్గా ఎంపిక చేశారు. దీంతో రోహిత్ కెప్టెన్సీ శకం ముగిసినట్లయింది. ఈ సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తమ మాజీ కెప్టెన్ కు ప్రత్యేక సందేశం ద్వారా అభినందనలు తెలియజేసింది. ఈ సందేశం ద్వారా రోహిత్ శర్మ ఇక అంతర్జాతీయ క్రికెట్లో కెప్టెన్గా కనిపించరని స్పష్టమైంది.
ఏం జరిగింది?
ఆస్ట్రేలియా పర్యటన కోసం జట్టు ఎంపికపై అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ముఖ్యంగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వన్డే కెప్టెన్ గా కొనసాగుతారా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. జట్టులో రోహిత్ శర్మ పేరు ఉన్నప్పటికీ.. సెలెక్టర్లు శుభ్మన్ గిల్ను నూతన కెప్టెన్ గా ప్రకటించారు. ఈ క్రమంలో ఓ గొప్ప భారత కెప్టెన్సీ శకం ముగిసింది. రోహిత్ శర్మ ఇప్పుడు జట్టులో సభ్యుడిగా ఉంటారు కానీ, కెప్టెన్సీ బాధ్యతలు మాత్రం గిల్ చూసుకుంటాడు. జట్టు ఎంపిక అనంతరం బీసీసీఐ ఓ పోస్ట్ చేస్తూ.. రోహిత్ శర్మ కెప్టెన్సీ కెరీర్ ముగిసినట్లు సూచించింది.

బీసీసీఐ సందేశం
బీసీసీఐ తమ పోస్టులో.. "రో హిట్ ఎఫెక్ట్. ఆసియా కప్ 2023, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025. వన్డే కెప్టెన్గా రోహిత్ శర్మ శకానికి వందనం." అని పేర్కొంది. ఈ సందేశం ద్వారా రోహిత్ కెప్టెన్సీ ముగింపు ఖరారైంది. కేవలం కొన్ని నెలల క్రితం ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన కెప్టెన్ కు కూడా తదుపరి ప్రపంచ కప్ వరకు అవకాశం ఇవ్వకపోవడం అభిమానులను నిరాశకు గురి చేసింది. కెప్టెన్గా , ఆటగాడిగా రోహిత్ ప్రదర్శన అద్భుతంగా ఉన్నప్పటికీ ఈ నిర్ణయం తీసుకోవడంపై చాలా మంది దిగ్గజాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
రోహిత్ శర్మ వన్డే కెప్టెన్సీ రికార్డు
రోహిత్ శర్మ వన్డే కెప్టెన్గా మొత్తం 56 మ్యాచ్లు ఆడారు. భారత జట్టు ఆ మ్యాచ్లలో 42 విజయాలు సాధించింది.అతని విజయ శాతం 76 శాతంగా ఉంది, ఇది అత్యుత్తమ రికార్డు. చివరి 16 ఐసీసీ ఈవెంట్లలో టీమిండియా కేవలం ఒక మ్యాచ్ మాత్రమే ఓడిపోయింది. వన్డే ప్రపంచకప్ ఫైనల్ వరకు జట్టును తీసుకెళ్లినప్పటికీ, ట్రోఫీ గెలవాలనే రోహిత్ లక్ష్యం నెరవేరలేదు. తదుపరి ప్రపంచకప్ గెలిచి తన కెరీర్ను ముగించాలని రోహిత్ ఆశించినప్పటికీ, ఇప్పుడు అది సాధ్యం కాకపోవచ్చు.