
టీమిండియా మాజీ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ తన అత్యుత్తమ టీమిండియా వన్డే తుది జట్టును ప్రకటించాడు. తన వన్డే జట్టులో ఆశ్చర్యకరంగా ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు చోటు ఇవ్వలేదు. వన్డే క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్, అత్యధిక డబుల్ సెంచరీలు, అత్యధిక సిక్సులు కొట్టిన రోహిత్ శర్మకు వెంకటేష్ ప్రసాద్ చోటు కల్పించకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వెంకటేష్ ప్రసాద్ అత్యుతమ భారత వన్డే జట్టును ఒక సారి పరిశీలిస్తే ఆ జట్టులో ఓపెనర్లుగా దిగ్గజ ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ను ఎంపిక చేశాడు. మూడో స్థానానికి మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, నాలుగో స్థానానికి మాజీ ఆటగాడు అజారుద్దీన్కు చోటు కల్పించాడు. ఐదో స్థానానికి మాజీ ఆల్రౌండర్ యువరాజ్సింగ్ను, ఆరో స్థానానికి గ్రేట్ మ్యాచ్ ఫినిషర్ మహేంద్ర సింగ్ ధోనిని ఎంపిక చేశాడు. ధోనినే వికెట్ కీపర్గా కూడా ఎంచుకున్నాడు.
ఆల్రౌండర్గా భారత్కు తొలి ప్రపంచకప్ అందించిన గ్రేట్ కెప్టెన్ కపిల్ దేవ్ను ఎంపిక చేశాడు. స్పిన్ కోటాలో దిగ్గజ బౌలర్లు అనిల్ కుంబ్లే, హర్బజన్ సింగ్కు చోటు కల్పించాడు. ఇక పేసర్లుగా జవగల్ శ్రీనాథ్, జహీర్ ఖాన్ను ఎంపిక చేశాడు. ఈ అత్యుత్తమ టీమిండియా వన్డే జట్టుకు మహేంద్ర సింగ్ ధోనిని కెప్టెన్గా నియమించాడు. కాగా ప్రస్తుతం వెంకటేష్ ప్రసాద్ ప్రకటించిన అత్యుత్తమ భారత వన్డే జట్టు నెట్టింట్లో వైరల్గా మారింది.
వెంకటేష్ ప్రసాద్ ప్రకటించిన అత్యుత్తమ భారత వన్డే జట్టు:
వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, మహమ్మద్ అజారుద్దీన్, యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్ & వికెట్ కీపర్), కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, జవగల్ శ్రీనాథ్, జహీర్ ఖాన్.
భారత జట్టు తరఫున వెంకటేష్ ప్రసాద్ 8 ఏళ్లపాటు ఆడాడు. 1994లో భారత జట్టులో అడుగుపెట్టిన వెంకటేష్.. 2001లో చివరి మ్యాచ్ ఆడాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్లో వెంకటేష్ ప్రసాద్ 33 టెస్టులు, 161 వన్డే మ్యాచ్లు ఆడాడు. 33 టెస్టులో 96 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 6/33. ఇక 161 వన్డే మ్యాచ్ల్లో 196 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 5/27 గా ఉన్నాయి.