Rohit Sharma: టీమిండియా మాజీ కెప్టెన్, హిట్ మ్యాన్గా పేరుగాంచిన రోహిత్ శర్మ క్రికెట్ ప్రపంచంలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు. రాంచీలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో ఆయన 57 పరుగుల దూకుడు ఇన్నింగ్స్తో అద్భుతమైన ఫీట్ సాధించారు. ఈ మ్యాచ్లో ఆయన పాకిస్తాన్ దిగ్గజం షాహిద్ అఫ్రిది పేరిట ఉన్న అత్యధిక వన్డే సిక్సర్ల రికార్డును బద్ధలు కొట్టారు. షాహిద్ అఫ్రిది 351 సిక్సర్ల రికార్డును అధిగమించి కేవలం 269 ఇన్నింగ్స్లలో 352 సిక్సర్లతో వన్డే క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు.
సిక్సర్ల రికార్డును ధ్వంసం చేసిన తర్వాత రోహిత్ శర్మ ఇప్పుడు తన కెరీర్లో మరో అరుదైన, భారీ మైలురాయిపై దృష్టి సారించారు. రాయ్పూర్లో దక్షిణాఫ్రికాతో జరగబోయే రెండో వన్డేలో రోహిత్ శర్మ 20 వేల అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం హిట్మ్యాన్ అంతర్జాతీయ కెరీర్లో 19,959 పరుగులు సాధించారు. అంటే ఈ ఘనతను చేరుకోవడానికి ఆయనకు ఇంకా కేవలం 41 పరుగులు మాత్రమే అవసరం. ఈ పరుగులు సాధిస్తే రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో 20 వేల పరుగుల మార్కును దాటిన నాలుగో భారతీయ బ్యాటర్గా చరిత్ర సృష్టించనున్నాడు.

ఈ ప్రతిష్ఠాత్మకమైన క్లబ్లో ఇప్పటికే మహామహులు ఉన్నారు. సచిన్ టెండూల్కర్(34,357 పరుగులు) ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ (27,808 పరుగులు), రాహుల్ ద్రవిడ్ (24,064 పరుగులు) తరువాతి స్థానాల్లో ఉన్నారు. వీరు ముగ్గురూ భారత క్రికెట్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ఆటగాళ్లు. ఈ దిగ్గజాల సరసన రోహిత్ శర్మ చేరితే అది భారత క్రికెట్కు గొప్ప గర్వకారణం అవుతుంది. ఆయన నిలకడైన ప్రదర్శనకు నిదర్శనం అవుతుంది. రోహిత్ తన 503 అంతర్జాతీయ మ్యాచ్ల కెరీర్లో ఇప్పటివరకు 50 సెంచరీలు, 110 అర్ధసెంచరీలతో సహా 42.46 సగటుతో 19,959 పరుగులు చేశాడు.