
ముంబై: రంజీల్లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ముంబై జట్టు ఆటగాళ్లతో టీమిండియా పరిమిత ఓవర్ల వైస్కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ ముచ్చటించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ఆడాలన్న దానిపై ఆటగాళ్లకు రోహిత్ పలు సూచనలు చేశాడని సమాచారం తెలిసింది. రైల్వేస్, కర్ణాటక జట్ల చేతిలో ముంబై వరుసగా రెండు పరాజయాలు చవిచూసిన సంగతి తెలిసిందే. రైల్వేస్తో జరిగిన మ్యాచ్లో 10 వికెట్లు, కర్ణాటకతో 5 వికెట్ల తేడాతో ముంబై ఘోర పరాజయాలు చవిచూసింది.
ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న శ్రీలంక టీ20 సిరీస్కు 'హిట్మ్యాన్' రోహిత్ విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆదివారం బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) మైదానంలో ప్రాక్టీస్ చేసేందుకు రోహిత్ వచ్చాడు. ఈ సమయంలో రంజీ టోర్నీలో వరుస ఓటములను ఎదుర్కొంటున్న ముంబై జట్టు గట్టెక్కేందుకు ఆటగాళ్లకు సూచనలు చేశాడట. ముంబై కోచ్ వినాయక్ సమంత్, బౌలింగ్ కోచ్ ప్రదీప్ సుందరం, జట్టు మేనేజర్ అజింక్య నాయక్ సైతం రోహిత్ మాట్లాడే సందర్భంలో అక్కడే ఉన్నారని తెలుస్తోంది.
41 సార్లు రంజీ ట్రోఫీ కైవసం చేసుకున్న ముంబై ప్రస్తుతం వరుస ఓటుములతో కష్టాలను ఎదుర్కొంటోంది. తర్వాతి మ్యాచ్లో జనవరి 11 నుంచి చెన్నైలోని చెపాక్ మైదానంలో తమిళనాడుతో ముంబై తలపడనుంది. న్యూజిలాండ్-ఏ సిరీస్కు ఎంపికైన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జట్టుకు అందుబాటులో ఉండటం లేదు. దీంతో ముంబై కష్టాలు మరింత పెరగనున్నాయి. మరి రోహిత్ సూచనలతో ఆటగాళ్లు గాడిలో పడుతారేమో చూడాలి.
గతేడాది మూడు ఫార్మాట్లలో ఓపెనర్గా 2,442 పరుగులు చేసి రికార్డు సృష్టించడంపైన రోహిత్ స్పందించాడు. 'ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. కానీ జట్టుగా సాధిస్తున్న విజయాల పట్ల సంతోషంగా ఉన్నా. ఆ రికార్డు మంచిదే.. కానీ ప్రతి సిరీస్ గెలువడంపైనే మేం దృష్టిసారిస్తాం. బాగా ఆడితే రికార్డులు వాటంతటికవే వస్తుంటాయి' అని రోహిత్ అన్నాడు.