టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన ఆటతో పాటు వ్యవహార శైలితో అభిమానులను అలరిస్తుంటాడు. టాస్ సందర్భంలో రోహిత్ చేసిన పనులు చాలా ఫన్నీగా ఉంటాయి. టాస్ గెలిచిన తర్వాత ఏం ఎంచుకోవాలో, తుదిజట్టు వివరాలు వంటివి మరిచిపోవడం రోహిత్కు చాలా సాధారణం. ఇక మైదానంలో రివ్యూ కోరే సమయంలో, సహచరుల ఆటగాళ్లను టీజ్ చేయడంలో హిట్మ్యాన్ స్టైల్ డిఫ్రెంట్.
అయితే రోహిత్ ఎన్నో విషయాలు మరిచిపోవడం సర్వసాధారణమే అని, కానీ ఓ విషయాన్ని మాత్రం ఎట్టిపరిస్థితిలో మరిచిపోడని టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అన్నాడు. టాస్ సందర్భంలో తడబాటు, బస్సులో ఫోన్లు మరిచిపోవడం రోహిత్ తరుచుగా చేస్తుంటాడని, కానీ గేమ్ ప్లాన్ను మాత్రం ఎప్పటికీ మరిచిపోడని పేర్కొన్నాడు. ఇక మైదానంలో రోహిత్ అనుసరించే వ్యూహాలు కోచింగ్ స్టాఫ్కు కూడా అర్థం కావని తెలిపాడు.

''రోహిత్ కెప్టెన్సీ వ్యూహాలు అద్భుతంగా ఉంటాయి. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ దీనికి నిదర్శనం. బుమ్రా కోటాను ముందుగానే ముగించాడు. కానీ అదే జట్టుకు మంచి చేసింది. చివరి ఓవర్లో ప్రత్యర్థికి 16 పరుగులను మిగిల్చింది. ఆ సమయంలో రోహిత్ నిర్ణయం ఎంతో మంది సందేహపడ్డారు. కానీ పనిచేసింది. రోహిత్ పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటాడు. అతని నిర్ణయాలు డగౌట్లో ఉన్న స్టాఫ్కు కూడా అర్థం కావు. అంతాముగిసిన తర్వాత క్లారిటీ వస్తుంది''
''టాస్కు వెళ్లిన సందర్భాల్లో బ్యాటింగ్/బౌలింగ్ ఎంచుకోవడంలో రోహిత్ తడబడుతుంటాడు. ఇక బస్సుల్లో తన ఫోన్లను మరిచిపోతుంటాడు. కానీ ఓ విషయాన్ని మాత్రం ఎప్పటికీ మరిచిపోడు. గేమ్ ప్లాన్పై పూర్తి స్పష్టతతో ఉంటాడు'' అని విక్రమ్ రాథోడ్ పేర్కొన్నాడు. ఇక ప్రణాళికల కోసం రోహిత్ ముందుగా ఎంతో సమయాన్ని వెచ్చిస్తాడని విక్రమ్ తెలిపాడు. బ్యాటర్ల, బౌలర్లలో సమావేశంలో పాల్గొంటూ ఆటగాళ్లు ఎలా ఆలోచిస్తున్నారో రోహిత్ తెలుసుకుంటాడని పేర్కొన్నాడు.
దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఓ దశలో భారత్ ఓటమి ఖాయంగా కనిపించింది. కానీ బౌలర్లు గొప్ప కృషి, రోహిత్ అద్భుతమైన సారథ్యంలో టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. కాగా, పొట్టి ఫార్మాట్ కప్ గెలిచిన అనంతరం రోహిత్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వన్డే, టెస్టు ఫార్మాట్లలో భారత జట్టును నడిపిస్తున్నాడు.