తొలి టెస్టులో భారత్పై ఇంగ్లాండ్ విజయం సాధించడంతో ఆ జట్టు మాజీలు రోహిత్ శర్మను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్సీ ఏవరేజ్గా ఉందని, ఉప్పల్ టెస్టులో విరాట్ కోహ్లి కెప్టెన్గా ఉంటే టీమిండియా ఓడిపోయేది కాదని మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా హిట్మ్యాన్పై మరో ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు జాఫ్రీ బాయ్కాట్ ఘూటు విమర్శలు చేశాడు. 36 ఏళ్ల రోహిత్ శర్మ తన అత్యుత్తమ ఫామ్ దశను కోల్పోయాడని, ఇప్పుడు జట్టులో కేవలం అతిథిలా మాత్రమే బ్యాటింగ్ చేస్తున్నాడని అన్నాడు.
''టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు సుమారు 37 ఏళ్లు ఉండొచ్చు. అతడు తన అత్యుత్తమ దశను దాటేశాడు. కొన్ని మంచి ఇన్నింగ్స్లు ఆడినప్పటికీ గత నాలుగేళ్లలో స్వదేశంలో అతడు టెస్టుల్లో రెండు సెంచరీలు మాత్రమే చేశాడు. సొంతగడ్డపై గత 12 ఏళ్లగా అప్రతిహతంగా దూసుకెళ్తున్న భారత్ విజయాలకు బ్రేక్ పడే సమయం వచ్చింది. టెస్టుల్లో టీమిండియాను ఓడించే ఆ సువర్ణావకాశం ఇప్పుడు ఇంగ్లాండ్ ముందు ఉంది. మరోవైపు వ్యక్తిగత కారణాలతో విరాట్ కోహ్లి, తొడకండరాల గాయంతో రవీంద్ర జడేజా దూరమవ్వడం భారత్కు ప్రతికూలంగా మారింది'' అని జాఫ్రీ బాయ్కాట్ పేర్కొన్నాడు.

2023లో రోహిత్ శర్మ ఎనిమిది టెస్టుల్లో 41 సగటుతో 545 పరుగులు చేశాడు. నాగ్పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో శతకం కూడా సాధించాడు. అయితే ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టుల్లో హిట్మ్యాన్ 20 సగటుతో 60 పరుగులు మాత్రమే చేశాడు. ఉప్పల్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులోనూ నిరాశపరిచాడు. 24, 39 పరుగులు చేశాడు. అయితే రెండో ఇన్నింగ్స్లో టీమిండియా బ్యాటర్లలో రోహిత్ స్కోరే అత్యధికం.

కాగా, విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టులకు అందుబాటులో ఉండని విషయం తెలిసిందే. మరోవైపు తొలి టెస్టులో గాయపడిన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా రెండో టెస్టుకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో వైజాగ్ టెస్టులో యువ బ్యాటర్లతో రోహిత్ బరిలోకి దిగనున్నాడు. విశాఖపట్నం వేదికగా జరగనున్న రెండో టెస్టు శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది.