ఢిల్లీ చేరుకున్న టీమిండియా టీమ్: విశ్వవేదికపై భారత్ను విజేతగా నిలిపిన రోహిత్ సేన సగర్వంగా స్వదేశానికి చేరుకుంది. గురువారం ఉదయం ఆరు గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ ఎయిర్ పోర్టుకు భారత ఆటగాళ్లు చేరుకున్నారు. 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తెరదించుతూ వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లతో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అడుగడుగునా నీరాజనం పలికారు.
ఈ క్రమంలో భారత ఆటగాళ్లు అభిమానులతో కలిసి చిందేశారు. రోహిత్ శర్మ మాస్ డ్యాన్స్తో అలరించాడు. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య కూడా స్టైలిష్ స్టెప్పులతో డ్యాన్స్ వేశారు. బీట్కు తగ్గట్లుగా కాళ్లు కదుపుతూ భారత ఆటగాళ్లు అభిమానులను ఉర్రూతలూగించారు. బార్డబోస్ వేదికగా జూన్ 29న దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో భారత్ విజయం సాధించి టీ20 వరల్డ్ కప్ గెలిచిన సంగతి తెలిసిందే.

అయితే వెస్టిండీస్లో భీకర తుఫాను కారణంగా భారత ఆటగాళ్లు స్వదేశానికి చేరుకోవడానికి ఆలస్యమైంది. మూడు రోజుల పాటు బార్బడోస్లోనే ఉన్నారు. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో టీమిండియా బుధవారం బయల్దేరి గురువారం తెల్లవారుజామును ఢిల్లీకి చేరుకుంది. భారత ఆటగాళ్ల కోసం అభిమానులు పెద్దఎత్తున ఢిల్లీ విమానశ్రయానికి చేరుకున్నారు.
కాగా, ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని టీమిండియా కలవనుంది. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత భారత జట్టు ముంబైకి బయల్దేరుతుంది. అనంతరం సాయంత్రం 5 గంటలకు రోడ్ షో ప్రారంభమవుతుంది. రెండు గంటల పాటు ఊరేగింపు జరగనుంది. గతంలో ధోనీ సేన పాల్గొన్నట్లుగానే ఓపెన్ టాప్ బస్సులో ప్రపంచ కప్పుతో టీమిండియాకు అభిమానులకు అభివాదం చేయనుంది. అంతేగాక రాత్రి ముంబైలోని వాంఖడే స్టేడియంలో సన్మాన కార్యక్రమం జరగనుంది.