
పెర్త్: టీ20 ప్రపంచకప్ 2022లో భారత క్రికెట్ జట్టు జైత్రయాత్ర సాగిస్తోంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్లల్లో ఘన విజయాన్ని అందుకుంది. ప్రత్యర్థులను చిత్తు చేసింది. గ్రూప్ 2 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం టీమిండియా ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి. ఇక తన తదుపరి మ్యాచ్ను ఆదివారం ఆడబోతోంది. దక్షిణాఫ్రికాను ఎదుర్కొనబోతోంది. ఈ రెండు జట్లు గ్రూప్-2లో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి.
ఆదివారం సాయంత్రం 4:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. పెర్త్ స్టేడియం దీనికి వేదిక. ఈ మ్యాచ్ కోసం టీమ్ మొత్తం పెర్త్కు చేరుకుంది కూడా. అక్కడే నెట్ ప్రాక్టీస్ చేస్తోంది. దక్షిణాఫ్రికాతో భారత్ పోరు మాత్రమే కాకుండా- మరో రెండు మ్యాచ్లు షెడ్యూల్ అయ్యాయి. తొలి మ్యాచ్లో బ్రిస్బేన్లోని గబ్బా స్టేడియం వేదికగా బంగ్లాదేశ్-జింబాబ్వే తలపడనున్నాయి. ఉదయం 8:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతంది.
ఈ నేపథ్యంలో- టీమిండియా ప్రస్థానంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడారు. ఎక్కడ? ఎలా గెలవాలనే విషయం రోహిత్ శర్మకు బాగా తెలుసని, అందుకు అనుగుణంగా వ్యూహాలను రూపొందించుకునే శక్తిసామర్థ్యాలు అతనికి ఉన్నాయని చెప్పారు. జట్టు ప్లేయర్లు తమ పని తాము చేసుకుంటూ వెళ్తే చాలు- మిగిలినదంతా రోహిత్ శర్మ చూసుకుంటాడని, జట్టును ఎలా విజయపథంలో నడిపించాలనే దానిపై అతనికి ఫుల్ క్లారిటీ ఉందని వ్యాఖ్యానించారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్స్లల్లో రోహిత్ శర్మ సత్తా ఏమిటనేది ప్రతి ఒక్కరూ చూశారని సౌరవ్ గంగూలీ ఉదహరించారు. తాను ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న ముంబై ఇండియన్స్ జట్టును మోస్ట్ సక్సెస్ఫుల్గా తీర్చిదిద్దడంలో రోహిత్ శర్మ చేసి కృషి ఎంతో ఉందని అన్నారు. అతని నాయకత్వంలో ముంబై ఇండియన్స్ అయిదుసార్లు ఛాంపియన్గా నిలిచిందని చెప్పారు. అంతర్జాతీయ మ్యాచ్లల్లో ఎలా ఆడాలి..? ఎలా ఆడకూడదు.. షాట్ సెలెక్షన్ గురించి రోహిత్ శర్మకు చెప్పాలని అవసరం లేదని అన్నారు.
ఐసీసీ నిర్వహించే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లల్లో ఆడే స్టైల్పై మరొకరి నుంచి సలహాలు, సూచనలను తీసుకునే అవసరం రోహిత్కు లేదని గుర్తు చేశారు. ఒక కేప్టెన్గా జట్టును ఎలా విజయతీరాలకు చేర్చాలనే దానిపై ఎలాంటి గందరగోళం గానీ, ఆందోళన గానీ చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ముంబై ఇండియన్స్ను అయిదుసార్లు ఛాంపియన్గా నిలిపాడని సౌరవ్ గుర్తు చేశారు. అదే వ్యూహాలతో టీ20 ప్రపంచకప్ నుంచి కూడా రోహిత్ శర్మ అందుకుంటాడని ఆశిస్తున్నట్లు సౌరవ్ గంగూలి వ్యాఖ్యానించారు.