రోహిత్ అరుదైన రికార్డు
ఈ టెస్టు సిరీస్ ద్వారా రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డును సాధించాడు. మూడో టెస్టులో రోహిత్ డబుల్ సెంచరీ సాధించడంతో ఒక అరుదైన రికార్డును నమోదు చేశాడు. ఒక టెస్టు మ్యాచ్లో ప్రత్యర్థి జట్టు రెండు వేర్వేరు ఇన్నింగ్స్లలో నమోదు చేసిన స్కోరు కంటే ఎక్కువ పరుగులు సాధించిన ఐదో భారత్ ఆటగాడిగా రోహిత్ రికార్డుల్లోకి ఎక్కాడు. తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 162 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్లో 133 పరుగులకే ఆలౌట్ అయింది. రోహిత్ చేసిన పరుగుల్ని కూడా దక్షిణాఫ్రికా తమ ఇన్నింగ్స్లో సాధించలేకపోయింది.
తొలిసారి వినూ మన్కడ్
టీమిండియా తరపున వినూ మన్కడ్ (231-న్యూజిలాండ్పై) తొలిసారి ఈ ఫీట్ సాధించాడు. 1955-56 సీజన్లో న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో మన్కడ్ ఈ ఘనత సాధించాడు. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ 209 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్లో 219 పరుగులు చేసింది. రాహుల్ ద్రవిడ్ (270) రెండో స్థానంలో ఉన్నాడు. 2003-04 సీజన్లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో రాహుల్ ద్రవిడ్ దీన్ని సాధించాడు. పాకిస్తాన్ తన తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకు ఆలౌటైతే.. రెండో ఇన్నింగ్స్లో 245 పరుగులు చేసింది.
మూడో స్థానంలో సచిన్
సచిన్ టెండూల్కర్ (248) మూడో స్థానంలో నిలిచాడు. 2004-05 సీజన్లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో సచిన్ ఈ జాబితాలో చేరాడు. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 184 పరుగులు చేస్తే.. రెండో ఇన్నింగ్స్లో 202 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (243) 2017-18 సీజన్లో శ్రీలంకపై సాధించాడు. లంక తొలి ఇన్నింగ్స్లో 205 ఆలౌటైతే.. రెండో ఇన్నింగ్స్లో 166 పరుగులకు కుప్పకూలింది. ఇక రాంచీ టెస్ట్ మ్యాచ్ ద్వారా రోహిత్ శర్మ వీరి సరసన చేరాడు.
తొలి ఓపెనర్గా రికార్డు
రోహిత్ మూడో టెస్ట్లో డబుల్ సాధించడంతో దక్షిణాఫ్రికాపై ఒక ద్వైపాక్షిక సిరీస్లో రెండు సార్లు 150కిపైగా పరుగులు సాధించిన తొలి ఓపెనర్గా రికార్డు సృష్టించాడు. అంతేకాదు తొలి ఇండియన్ క్రికెటర్గా కూడా రోహిత్ కొత్త రికార్డు నెలకొల్పాడు. ఓవరాల్గా ఈ ఫీట్ సాధించిన ఎనిమిదో క్రికెటర్గా రోహిత్ నిలిచాడు. ఒక సిరీస్లో రెండు కంటే ఎక్కువ సెంచరీలు చేసిన తొలి భారత ఓపెనర్గా కూడా రికార్డుల్లోకెక్కాడు. 1970లో సునీల్ గవాస్కర్ ఒకే సిరీస్లో 2 సెంచరీలు చేస్తే.. తాజాగా రోహిత్ (3) అధిగమించాడు. ఒక టెస్టు సిరీస్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మన్గా కూడా రోహిత్ నిలిచాడు.