ఆస్ట్రేలియాతో ఆడిన మూడో వన్డేలో భారత జట్టు ఓడిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు పెద్ద కష్టమే వచ్చిందట. రాజ్కోట్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు రోహిత్ శర్మ పర్సనల్ ఐఫోన్ పోయిందట. దీన్ని ఎవరో దొంగిలించి ఉంటారని అనుకుంటున్నారు.
అయితే తన వస్తువులు మర్చిపోయే అలవాటున్న రోహిత్.. మొబైల్ను కూడా మర్చిపోయాడేమో అని మరికొందరు అంటున్నారు. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్కు ముందు నెట్స్లో రోహిత్ ప్రాక్టీస్ చేశాడు. ఆ సమయంలోనే రోహిత్ మొబైల్ పోయిందట.

ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అయింది. ఈ విషయాన్ని అంత సీరియస్గా తీసుకోని రోహిత్.. ఆసీస్పై తనదైన స్టైల్లో బ్యాటింగ్ చేసి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సిరీసులో తొలి రెండు మ్యాచులకు దూరంగా ఉన్న రోహిత్.. మూడో వన్డేల టీంతో కలిశాడు. మైదానంలో దిగినప్పటి నుంచి చాలా కంఫర్ట్గా కనిపించిన అతను.. బ్యాటింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై చెలరేగాడు.
ఈ మ్యాచులో భారత్ ఓడినా కూడా రోహిత్ బ్యాటింగ్ మాత్రం ఫ్యాన్స్కు తెగ నచ్చింది. సరిగ్గా వరల్డ్ కప్ ముందు రోహిత్ బ్యాటింగ్ పీక్స్ చేరుతోందని వాళ్లు హ్యాపీ ఫీలవుతున్నారు. కాగా, రోహిత్ మొబైల్ ఫోన్ పోయినట్లు ఫిర్యాదు చేశారని, అది ఎక్కడ ఉందో కనుక్కోవడానికి అధికారులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారని సమచాారం.
కొన్ని రోజుల క్రితం ఆసియా కప్ ముగిసిన తర్వాత కొలంబో నుంచి భారత జట్టు ముంబై బయలుదేరింది. ఆ సమయంలో రోహిత్ తన పాస్పోర్టును హోటల్లో మర్చిపోయిన సంగతి తెలిసిందే. బస్సులో ఎక్కిన తర్వాత రోహిత్ ఈ విషయం గమనించాడు. దీంతో సపోర్ట్ స్టాఫ్ మెంబర్స్ వెంటనే హోటల్కు వెళ్లి రోహిత్ పాస్పోర్టును తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో కూడా బాగా వైరల్ అయింది.