క్రికెట్ ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ పోరుకు రంగం సిద్ధమైంది. న్యూయార్క్లోని నాసా కౌంటీ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు ఈ హై వోల్టేజ్ వార్ ప్రారంభం కానుంది. అయితే ఈ ఆసక్తికర మ్యాచ్ ముంగిట టీమిండియాకు షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి గాయపడ్డాడు.
ఐర్లాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో రోహిత్ గాయపడిన విషయం తెలిసిందే. లిటిల్ వేసిన బంతి రోహిత్ భుజానికి బలంగా తాకింది. అనంతరం రిటైర్ట్ హట్గా వెనుదిరిగాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం హిట్ మ్యాన్ మాట్లాడుతూ గాయం గురించి చెందాల్సిన పనిలేదని వివరణ ఇచ్చాడు. మరోవైపు సుదీర్ఘంగా సాగే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకుని రోహిత్కు పాకిస్థాన్ మ్యాచ్లో విశ్రాంతి ఇవ్వనున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి.

ఆ వార్తలకు బ్రేక్లు వేస్తూ రోహిత్ శర్మ గాయం నుంచి కోలుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. నెట్స్లో సాధన చేశాడు. అయితే ప్రాక్టీస్లో రోహిత్ శర్మకు మరో గాయమైనట్లు తెలుస్తోంది. త్రోడౌన్ స్పెషలిస్ట్ నువాన్ వేసిన బంతి అనూహ్యంగా బౌన్స్ కావడంతో రోహిత్ చేతివేళ్లకు గాయమైందని సమాచారం. దీంతో వెంటనే రోహిత్ ప్రాక్టీస్ ఆపేశాడు. అయితే కాసేపటి తర్వాత కొద్దిసేపు సాధన చేసి మైదానాన్ని వీడినట్లు తెలుస్తోంది.
రోహిత్ శర్మ గాయంపై బీసీసీఐ అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ రోహిత్ పాకిస్థాన్ మ్యాచ్కు దూరమైతే టీమిండియాకు అది తీవ్ర ప్రతికూలాంశమే. యూఎస్ఏలోని కఠిన పిచ్లపై ఈ గేమ్ ఛేంజర్ మ్యాచ్ను ఒంటిచేత్తో మలుపుతిప్పగలడు. కాగా, హిట్మ్యాన్ గైర్హాజరీ అయితే జట్టు పగ్గాలను వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య అందుకునే అవకాశాలూ ఉన్నాయి. అలాగే విరాట్ కోహ్లితో కలిసి యశస్వీ జైస్వాల్ ఇన్నింగ్స్ ఆరంభించే ఛాన్స్ ఉంటుంది. టీ20 వరల్డ్ కప్-2024లో భారత జట్టు ఓపెనర్లుగా రోహిత్-కోహ్లి కలిసి బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే.
భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్) సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబె, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్