
లండన్: ఇంగ్లండ్తో లార్డ్స్ వేదికగా జరుగుతోన్న రెండో టెస్టులో భారత జట్టు నిలకడగా ఆడుతోంది. తొలుత నిదానంగా ఆడిన స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఆ తర్వాత ఒక్కసారిగా టాప్ గేర్లోకి వెళ్లిపోయాడు. జోరుపెంచిన రోహిత్ ఫోర్లు బాదుతూ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓలి రాబిన్సన్ వేసిన 25 ఓవర్ ఇదో బంతికి సింగల్ తీసిన హిట్మ్యాన్ 50 పరుగులు పూర్తిచేశాడు. మొత్తం 83 బంతులు ఎదుర్కొన్న రోహిత్.. 8 ఫోర్ల సాయంతో అర్ధ శతకం నమోదు చేశాడు. టెస్టుల్లో శర్మకు ఇది 13వ ఫిఫ్టీ. మరోవైపు కేఎల్ రాహుల్ నిదానంగా ఆడుతూ రోహిత్కు సహకరిస్తున్నాడు. ప్రస్తుతం 33 ఓవర్లు ముగిశాయి. టీమిండియా వికెట్ నష్టపోకుండా 100 పరుగులు చేసింది. రోహిత్ 75 రాహుల్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు.
రెండో టెస్ట్ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 14 ఓవర్లు ముగిసే సమయానికి 22/0తో నిలిచింది. అప్పటికి 50 బంతుల్లో 13 పరుగులే చేసిన రోహిత్ శర్మ.. ఇన్నింగ్స్ 15వ ఓవర్ వేసిన ఫాస్ట్ బౌలర్ సామ్ కరన్కు చుక్కలు చూపించాడు. సామ్ బౌలింగ్లో వరుస బౌండరీల మోత మోగించాడు. 15వ ఓవర్ మొదటి బంతిని కరన్ ఓవర్ పిచ్డ్ డెలివరీగా సంధించాడు. దాంతో ఆ బంతిని పాయింట్ దిశగా బౌండరీకి తరలించిన రోహిత్.. ఆ తర్వాత గుడ్ లెంగ్త్ బంతి థర్డ్ స్లిప్ మీదుగా బౌండరీకి పంపాడు.
అయితే మూడో బంతిని సామ్ కరన్ ఇన్ స్వింగర్ రూపంలో సంధించగా.. ఆ బంతిని రోహిత్ శర్మ హిట్ చేయలేకపోయాడు. ఆ తర్వాత నాలుగో బంతిని మళ్లీ పాయింట్ దిశగా ఫోర్ కొట్టిన హిట్మ్యాన్.. ఫ్యాడ్స్పైకి వచ్చిన ఐదో బంతిని మిడ్ వికెట్ దిశగా బౌండరీకి తరలించాడు. ఆరో బంతిని మాత్రం ఆడకుండా వదిలేశాడు. మొత్తంగా ఆ ఓవర్లో కరన్ 22 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత సామ్ వేసిన 17వ ఓవర్లోనూ మరో ఫోర్ కొట్టాడు. దీంతో కరన్కి చెమటలు పట్టేశాయి. ఆ తర్వాత కూడా రోహిత్ తన ఫామ్ కొనసాగించాడు. ఏ బౌలర్ను కూడా వదలలేదు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు.
క్రికెట్ పుట్టినిళ్లు లార్డ్స్ మైదానంలో భారత ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు ఓ అరుదైన రికార్డు నెలకొల్పారు. తొలి వికెట్కు అత్యధిక భాగస్వామ్యం అందించిన రెండో జోడిగా నిలిచారు. 2008లో ఇంగ్లండ్ ఓపెనర్లు అలిస్టర్ కుక్, ఆండ్రూ స్ట్రాస్.. దక్షిణాఫ్రికాపై నెలకొల్పిన 114 పరుగులే అత్యధికం. 13 సంవత్సరాలుగా మరే జోడి కూడా 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పలేకపోయింది. ప్రస్తుతం రాహుల్, రోహిత్ జోడి 108 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. కుక్, స్ట్రాస్ జోడి రికార్డును బద్దలుకొట్టే అవకాశం భారత జోడికి ఉంది. మరోవైపు లార్డ్స్ మైదానంలో 1952 తర్వాత అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడిగా కూడా రాహుల్, రోహిత్ మరో రికార్డు నెలకొల్పారు.