ఇక బ్యాట్స్మన్కు కష్టమే.. టచ్లోకి రావాలంటే సమయం పడుతుంది: రోహిత్

ముంబై: క్రికెట్ ఆటలో బౌలర్లు బంతిపై ఉమ్మి, చెమట రాయడం కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తికి దారి తీయవచ్చన్న చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉమ్మి, చెమట స్థానంలో మైనపు పూతను తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో కరోనా తగ్గిన తర్వాత మ్యాచ్లు మొదలైతే.. బౌలర్లకు బంతిపై పట్టుచిక్కడం కష్టమే అంటున్నారు. తిరిగి ఆటలు మొదలైతే బౌలర్లకు మాత్రమే కాదు బ్యాట్స్మన్కు కష్టమే అని టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అంటున్నాడు.

టచ్లోకి రావాలంటే సమయం పడుతుంది
తిరిగి ఆటలు మొదలైతే.. బ్యాట్స్మన్ మళ్లీ టచ్లోకి రావాలంటే కనీసం నెలన్నర సమయం పడుతుందని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీతో ఇన్స్టాగ్రామ్ లైవ్లో రోహిత్ మాట్లాడాడు. 'బ్యాట్స్మెన్లు బంతిని చక్కగా బ్యాట్కి మిడిల్ చేయాలంటే.. కనీసం నెలన్నర సమయం పడుతుంది. బ్యాటింగ్ సమయంలో బ్యాట్స్మెన్ కంటి-చేతి సమన్వయం చాలా కీలకం. అది చక్కగా కుదిరినప్పుడే షాట్ ఆడగలరు. లేకపోతే అంతర్జాతీయ స్థాయిలో గంటకి 140కిమీ పైగా వేగంతో వచ్చే బంతుల్నిఆడడం చాలా కష్టం' అని రోహిత్ తెలిపాడు.

ప్రాక్టీస్ చాలా అవసరం
'ఇప్పటికే దాదాపు మూడు నెలలుగా ఆటగాళ్లు క్రికెట్కి దూరంగా ఉండిపోయారు. మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాలంటే ప్రాక్టీస్ చాలా అవసరం. తిరిగి ఆటలు మొదలైతే ఎవరికైనా మునుపటి లయ అందుకోవడానికి కచ్చితంగా సమయం పడుతుంది' అని రోహిత్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ కూడా ఇదే అభిప్రాయాన్ని తెలిపాడు. దేశంలో లాక్డౌన్ విధించడంతో ఇంటి దగ్గరే ఉంటున్న క్రికెటర్లు.. ఫిజికల్గా మాత్రం బాడీని ఫిట్గా ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మాత్రం ప్రాక్టీస్ చేయడం లేదు.

ఐపీఎల్ నిరవధిక వాయిదా
అన్ని సవ్యంగా ఉంటే.. ఈపాటికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ రసపట్టులో ఉండేది. మ్యాచులు అన్ని రసవత్తరంగా సాగేవి. కానీ.. కరోనా వైరస్ కారణంగా ఈ టోర్నీని బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసేసింది. దేశంలో పరిస్థితులు ఇప్పటికీ అదుపులోకి రాకపోవడంతో ఇప్పట్లో టోర్నీ జరిగే సూచనలు కూడా కనిపించడం లేదు. మార్చి 29 నుంచి ఐపీఎల్ సీజన్ ప్రారంభంకావాల్సి ఉండే.

80లక్షలు విరాళం
కరోనాపై పోరాటం కోసం రోహిత్ శర్మ మొత్తం రూ.80లక్షలను విరాళంగా ప్రకటించాడు. పీఎం కేర్స్ ఫండ్కు రూ.45 లక్షలు.. మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.25 లక్షలు.. ఫీడింగ్ ఇండియా, వెల్ఫేర్ ఆఫ్ స్ట్రే డాగ్స్ సంస్థలకు చెరో రూ.5లక్షలు అందించినట్టు మంగళవారం రోహిత్ శర్మ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. జొమాటో ఫీడింగ్ సంస్థ ద్వారా పేదల భోజనానికి, వీధి కుక్కుల సంరక్షణ కోసం రోహిత్ విరాళమిచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications