
హైదరాబాద్: కష్టాల్లో ఉన్న ఓ శ్రీలంక ఫ్యాన్కు టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సహాయం చేసి మంచి మనసున్న వ్యక్తి అని నిరూపించుకున్నాడు. భారత్-శ్రీలంక సిరీస్ను చూసేందుకు గాను మహ్మద్ నిలామ్, గయాన్ సేనానాయకే, పుబుడు అనే ముగ్గురు అభిమానులు నవంబర్లో శ్రీలంక నుంచి భారత్ పర్యటనకు వచ్చారు.

వీరిలో నిలామ్ తండ్రి క్యాన్సర్తో బాధపడుతున్నారు. భారత-శ్రీలంక టెస్ట్ సిరీస్లో చివరి మ్యాచ్ ముగిసిన తర్వాత తన తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమించిందని, వెంటనే ఆయనకు సర్జరీ చేయాలని నిలామ్కు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన సమయానికి నిలామ్ ఢిల్లీలో ఉన్నాడు. దీంతో ఢిల్లీ నుంచి కొలొంబో వెళ్లేందుకు సరిపడా డబ్బులేక పోవడంతో ఇబ్బంది పడ్డాడు.
భారత క్రికెట్ జట్టుకి వీరాభిమాని ఆయన సుధీర్ గౌతం ద్వారా ఈ విషయం తెలుసుకున్న రోహిత్ శర్మ నిలామ్కి ఫోన్ చేసి అతని వద్దకు పిలిపించుకొని టికెట్కు సరిపడా(దాదాపు రూ.20వేల) నగదు ఆర్థిక సహాయం చేశాడు. దీంతో నిలామ్ తన తండ్రి సర్జరీ సమయానికి కొలొంబో చేరుకొగలిగాడు.
నిలామ్ మంగళవారం ఓ జాతీయ ఛానల్కు ఇచ్చిన ఇంటర్యూలో 'భారత జట్టు బస చేస్తున్న హోటల్కి నన్ను రోహిత్ ఆహ్వానించి నాకు టికెట్కు సరిపడా డబ్బులు ఇచ్చాడు. మా నాన్న సర్జరీ బాగా జరిగింది. ఆయన ఆరోగ్యం బాగుంది. మా నాన్న ఆరోగ్యం బాగాలేదని తెలియగానే చాలా కంగారుపడ్డా.. రోహిత్ది చాలా పెద్ద మనస్సు... వెంటనే నన్ను పిలిచి రిటర్న్ టికెట్ కోసం సాయపడ్డాడు' అని అన్నాడు.
ఇక, టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతూ 'కోహ్లీ మాకు చాలాసార్లు సహాయం చేశాడు. మేం ఎప్పుడు మ్యాచ్ చూసేందుకు వచ్చినా మాకు టికెట్లు ఏర్పాటు చేసేవాడు' అని అన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.