లీడ్స్: భారత క్రికెట్ జట్టు డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ ప్రస్తుత ప్రపంచకప్ టోర్నమెంట్లో అద్వితీయంగా ఆడుతున్నాడు. అసాధారణ స్కోరును నమోదు చేస్తున్నాడు. ప్రపంచకప్ టోర్నమెంట్లో ఏ భారతీయ క్రికెటర్ కూడా ఇప్పటిదాకా నమోదు చేయని కొన్ని అరుదైన రికార్డులను తన పేరు మీద లిఖించుకున్నాడు. మిగిలిన మ్యాచుల్లో కూడా అతను ఇదే ఊపును కొనసాగిస్తే.. మరో మూడు రికార్డులు చరిత్ర పుటల్లో కలిసిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మూడింట్లో రెండు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరు మీద ఉన్నవే కావడం విశేషం.
అయిదు సెంచరీలో సరికొత్త రికార్డు..
ప్రపంచకప్ టోర్నమెంట్లో ఇప్పటిదాకా నాలుగు సెంచరీలు చేసి పడేశాడు రోహిత్ శర్మ. ఇప్పటిదాకా- భారతీయ క్రికెటర్ ఎవరూ దీన్ని అందుకోలేదు. ఓ ప్రపంచకప్ టోర్నమెంట్లో మూడు సెంచరీలను చేసిన ఘనత సచిన్ టెండుల్కర్ పేరు మీద ఉండేది. దీన్ని దాటేశాడు రోహిత్ శర్మ. మొన్నటి బంగ్లాదేశ్తో మ్యాచ్ సందర్భంగా తన నాలుగో సెంచరీని బాదేశాడు. దీనితో భారత్ తరఫున ఇప్పటిదాకా ఓ ప్రపంచకప్ టోర్నమెంట్లో నాలుగు సెంచరీలు సాధించిన ఆటగాడిగా ఆవిర్భవించాడు. ప్రస్తుతం ఒక ప్రపంచకప్లో నాలుగు సెంచరీలు చేసిన కుమార సంగక్కార రికార్డును సమం చేశాడు.
పాకిస్తాన్: 640/2..బాబర్ ఆజమ్-310 నాటౌట్: ముచ్చట తీర్చుకుంటున్న వీరాభిమానులు!
ప్రమాదంలో సచిన్ రికార్డులు
రోహిత్ శర్మ ఇంకో సెంచరీ చేస్తే.. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడు రికార్డులు అతని వశమౌతాయి. ఒక ప్రపంచకప్ టోర్నమెంట్లో అయిదు సెంచరీలు చేసిన మొదటి క్రికెటర్ అవుతాడతను. కుమార సంగక్కార రికార్డును అధిగమిస్తాడు. దీనితోపాటు- ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడవుతాడు. ప్రస్తుతం ఈ ఘనతను సాధించిన క్రికెటర్ సచిన్ టెండుల్కర్. 2003 ప్రపంచకప్లో టెండుల్కర్ చేసిన మొత్తం పరుగులు 673.
ప్రస్తుతం రోహిత్ శర్మ 544 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇంకో 129 పరుగులు చేయగలిగితే సచిన్ రికార్డు తుడిచిపెట్టుకుని పోతుంది. గ్రూప్ దశలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కూడా సచినే. 586 పరుగులతో సచిన్ మొదటిస్థానంలో ఉన్నారు. శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మ 42 పరుగులు సచిన్ రికార్డును అధిగమించివాడవుతాడు.