
హైదరాబాద్: ముంబై వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు. మొహాలి వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో సిక్సులు, ఫోర్లతో టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన రోహిత్ శర్మ ఈ ఏడాది అన్ని ఫార్మట్లలో కలిపి అత్యధిక సిక్సుర్లు బాదిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
ఈ క్యాలెండర్ ఇయర్లో రోహిత్ శర్మ మొత్తం 65 సిక్సులతో ఈ జాబితాలో అగ్రస్ధానంలో నిలిచాడు. అంతకముందు ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్సులు బాదిన రికార్డు దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ పేరిట ఉండగా ఇప్పుడు రోహిత్ శర్మ ఆ రికార్డుని అధిగమించాడు.
దక్షిణాఫ్రికాకు చెందిన ఏబీ డివిలియర్స్ 2015లో 63 సిక్సులు బాదాడు. ఒక క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక సిక్సులు కొట్టిన భారత బ్యాట్స్మన్గా సచిన్(58) 1998లో ఉన్న రికార్డును 19 ఏళ్ల తర్వాత రోహిత్ అధగమించాడు. టీ20ల్లో విధ్వంసకర బ్యాట్స్మెన్గా పేరొందిన క్రిస్గేల్ 2012లో మూడు ఫార్మట్లలో కలిపి 59 సిక్సులు బాదాడు.
కెరీర్ మొత్తంలో 454 సిక్సులతో అత్యధిక సిక్సులు కొట్టిన జాబితాలో క్రిస్ గేల్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 2011లో ఆస్ట్రేలియా ఆటగాడు షేన్ వాట్సన్ 57 సిక్సులు కొట్టగా... 2015లో పాకిస్థాన్ ఆటగాడు షాహిదీ ఆఫ్రిదీ 56 సిక్సలు బాదాడు. షాహిది అఫ్రిదీ తన కెరీర్ మొత్తంలో 476 సిక్సులు కొట్టి ఈ జాబితాలో అగ్రస్ధానంలో ఉన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.