హైదరాబాద్: నిదహాస్ ట్రోఫీలో టీమిండియా విజయాన్ని భారత అభిమానులతో పాటు లంక అభిమానులు సైతం పంచుకున్నారు. అంతేకాదు, వారి కోసం రోహిత్ శర్మ తన ఔదార్యాన్ని చాటారు. వివరాల్లోకి.. లంక పర్యటనలో ఉన్న భారత జట్టు ప్రాక్టీస్ చేసుకొనే సమయంలో బంతులు వేసేందుకు కవీన్ ఫెర్నాండే అనే 23 ఏళ్ల ఆటగాడిని శ్రీలంక క్రికెట్ బోర్డు నియమించింది. ఒకసారి ప్రాక్టీస్ సెషన్లో కవీన్ వేసిన బంతులను రిషబ్ పంత్ ఎదుర్కొంటుండగా గాయానికి లోనైయ్యాడు.
రిషబ్ పంత్ కొడితే ముక్కులోంచి రక్తం:
ఆ సమయంలో రిషబ్ పంత్ కొట్టిన ఓ బంతి అనుకోకుండా కవీన్ను బలంగా తాకడంతో ముక్కు, దవడ నుంచి రక్తం వచ్చింది. వెంటనే స్థానిక నవలోక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స అనంతరం కోలుకున్న కవీన్ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు.
రోహిత్ పరామర్శ:
కవీన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యి ఇంటికి వెళ్లినట్లు విషయం తెలుసుకున్న రోహిత్ రెండు వీఐపీ టిక్కెట్లు తీసుకుని కవీన్ ఇంటికి వెళ్లాడు. ఆదివారం జరిగే ఫైనల్ను చూసేందుకు రావాలని ఆహ్వానించాడు. దీంతో కవీన్ ఆనందానికి అవధుల్లేవు. ఆదివారం తండ్రితో కలిసి వచ్చి కవీన్ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించాడు. ఈ సందర్బంగా కవిన్ రోహిత్ శర్మను పొగడ్తలతో ముంచెత్తాడు.
కాగా, ఫైనల్ కోసం జరిగిన పోరులో బంగ్లా, లంక క్రికెటర్ల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్లో బంగ్లా జట్టు గెలుపొందగా భారత్తో తలపడింది. వివాదంతో వ్యతిరేకత పెంచుకున్న లంక అభిమానులు బంగ్లాదేశ్ జట్టుపై భారత విజయ సంబరాల్లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు.