వరల్డ్ కప్ ఫైనల్ ఓడిన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భవితవ్యంపై మరోసారి చర్చ మొదలైంది. ఈ మెగాటోర్నీలో తనదైన బ్రాండ్ క్రికెట్తో ఆకట్టుకున్న రోహిత్.. చివరకు ట్రోఫీ ముద్దాడటంలో మాత్రం విఫలమయ్యాడు. ఫైనల్లో బ్యాటింగ్ తడబడటంతో భారత జట్టు ఓటమిపాలైంది. ఈ క్రమంలో రోహిత్ ఫ్యూచర్పై బీసీసీఐ చర్చలు మొదలు పెట్టిందట.
ఈ క్రమంలో తనను టీ20లకు కన్సిడర్ చేయకపోయినా పర్లేదని రోహిత్ చెప్పేశాడట. అయితే వన్డేలు, టెస్టులపైనే ఇకపై రోహిత్ ఫోకస్ పెట్టనున్నాడని తెలుస్తోంది. 2021లో భారత జట్టు పగ్గాలు అందుకున్న అతని ముందు రెండు లక్ష్యాలను బీసీసీఐ ఉంచింది. అవే 2022 టీ20 వరల్డ్ కప్, 2023 వన్డే వరల్డ్ కప్. ఈ సమయంలోనే రాహుల్ ద్రావిడ్ను కొత్త కోచ్గా కూడా నియమించింది.

ఈ ఇద్దరి జోడీ కొత్త తరహా ఆటను అయితే పరిచయం చేసింది కానీ.. రెండు వరల్డ్ కప్లు గెలవడంలో విఫలమైంది. ఇప్పటికే 36 సంవత్సరాల వయసున్న రోహిత్.. ఇక ఎప్పటి వరకు ఆడతాడో తెలియదు. వచ్చే వన్డే వరల్డ్ కప్ నాటికి అతనికి 40 ఏళ్ల వయసు వచ్చేస్తుంది. కాబట్టి ఆ సమయానికి రోహిత్ను పక్కన పెట్టేసే అవకాశం ఉంది.
ఈ క్రమంలోనే 2027లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ వరకు మాత్రం అతన్ని కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికైతే వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ మీద అతను ఫోకస్ పెడతాడని బీసీసీఐ వర్గాలు చెప్పాయి. 2025లో మరోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. ఇదైనా గెలవాలని రోహిత్ అనుకుంటున్నాడు.
అదే సమయంలో కొత్త కుర్రాడిని కెప్టెన్గా తయారు చేసే బాధ్యతను కూడా రోహిత్కు అప్పగించనున్నారట. ప్రస్తుతానికి హార్దిక్ పాండ్యా ఉన్నా కూడా.. పాండ్యాకు మరీ ఎక్కువగా గాయాలవడం, అతను జట్టుకు దూరమవడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో మరో కుర్ర ప్లేయర్ను భవిష్యత్తు కెప్టెన్గా తయారు చేసే బాధ్యతను రోహిత్కు అప్పగిస్తారట.