
నాన్ కెప్టెన్'గా ప్రత్యేకత గుర్తింపు:
క్రికెట్ రంగంలో ఇంతకుముందు టీమిండియా కెప్టెన్లుగా సేవలు అందించిన సచిన్ టెండూల్కర్ (1998), ఎంఎస్ ధోనీ (2007), విరాట్ కోహ్లీలకే (2018) రాజీవ్ ఖేల్రత్న అవార్డు లభించింది. ఈ ముగ్గురి తర్వాత రోహిత్ శర్మ నాలుగో ఆటగాడిగా ఖేల్రత్న అవార్డును సొంతం చేసుకున్నాడు. దీంతో హిట్మ్యాన్ రోహిత్.. పూర్తిస్థాయి కెప్టెన్సీ చేపట్టకుండానే ఈ ఖేల్రత్నను సాధించిన తొలి ఆటగాడిగా ప్రత్యేకత గుర్తింపు సాధించాడు. పలువురు అభిమానులు 'నాన్ కెప్టెన్'గా ఈ అవార్డు అందుకుంటున్న తొలి క్రికెటర్ అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. శుక్రవారం భారత కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ అవార్డుల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే.

ఆసియాకప్ టోర్నీకి నాయకత్వం:
రోహిత్ శర్మ టీమ్ఇండియాకు పూర్తిస్థాయిలో కెప్టెన్సీ చేపట్టకపోయినా.. పలు సందర్భాల్లో విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకున్నప్పుడు జట్టుకు సారథ్యం వహించాడు. ఈ క్రమంలోనే 2018లో ఆసియాకప్ టోర్నీకి నాయకత్వం వహించాడు. అతడి కెప్టెన్సీలో భారత్.. బంగ్లాదేశ్తో ఆడిన ఫైనల్లో విజయం సాధించింది. దీంతో కోహ్లీ తర్వాత జట్టును సమర్థవంతంగా నడిపే ఆటగాడిగా అతడికి విశేషమైన మద్దతు లభించింది. పలువురు క్రికెటర్లు సైతం అతడి కెప్టెన్సీని మెచ్చుకుంటారు. ఇక 2019 ప్రపంచకప్లో భారత్ నిష్క్రమించిన అనంతరం రోహిత్కు పగ్గాలు అప్పగించాలని కూడా వార్తలు వచ్చాయి.

ఐపీఎల్లోనూ మంచి రికార్డు:
అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోనూ రోహిత్ శర్మకు మంచి రికార్డు ఉంది. అతడి సారథ్యంలో ముంబై ఇండియన్స్ నాలుగుసార్లు టైటిల్ సాధించిన సంగతి తెలిసిందే. గతేడాది ముంబై ఛాంపియన్ నిలిచింది. ప్రస్తుతం రోహిత్ ఐపీఎల్ 2020 కోసం యూఏఈలో ఉన్నాడు. అంతర్జాతీయ కెరీర్లో రోహిత్ ఇప్పటివరకు 32 టెస్టుల్లో, 224 వన్డేల్లో, 108 టీ20 మ్యాచ్ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇక 188 ఐపీఎల్ మ్యాచులు ఆడాడు.

రోహిత్తో పాటు మరో నలుగురు:
శుక్రవారం ప్రకటించిన స్పోర్ట్స్ అవార్డుల్లో రోహిత్ శర్మతో పాటు మరో నలుగురు ఖేల్రత్న అవార్డుకు ఎంపికయ్యారు. రోహిత్తో పాటు స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్, టేబుల్ టెన్నిస్ (టీటీ) సంచలనం మనికా బాత్రా, రియో (2016) పారా ఒలింపిక్ స్వర్ణ పతక విజేత మరియప్పన్ తంగవేలు, మహిళల హాకీ కెప్టెన్ రాణి రాంపాల్ ఖేల్రత్న అందుకోనున్నారు.


Click it and Unblock the Notifications












