
ఫ్లోరిడా: వెస్టిండీస్ టూర్లో భాగంగా ఫ్లోరిడా వేదికగా జరుగుతున్న టీ20 ట్రై సిరీస్ రెండో మ్యాచ్లో టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసి విండీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఓపెనర్లు మంచి ఆరంభమే ఇచ్చారు. శిఖర్ ధావన్ 23 పరుగులు (16 బంతుల్లో 4 ఫోర్లు) చేసి కీమోపాల్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు.
ఓపెనర్ రోహిత్ శర్మ 66 (48 బంతుల్లో; 6 ఫోర్లు, 3 సిక్స్లు ) హాఫ్ సెంచరీ చేసాడు. రోహిత్కి కెప్టెన్ విరాట్ కోహ్లీ (28) అండగా నిలిచాడు. థామస్ బౌలింగ్లో రోహిత్ భారీ షాట్కు యత్నించి హెట్మయిర్ చేతికి చిక్కాడు. రిషబ్ పంత్ కూడా ఐదు బంతుల్లో నాలుగు పరుగులు చేసి ఔటయ్యాడు. కాట్రెల్ బౌలింగ్లో కోహ్లీ క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో టీమిండియా నాలుగు కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.
మనీష్ పాండే (6) కూడా త్వరగానే ఔట్ అయ్యాడు. కాట్రెల్ బౌలింగ్లో పాండే భారీ షాట్కు యత్నించి కీపర్ పూరన్ చేతికి చిక్కాడు. చివరలో కృనాల్ పాండ్య (20), రవీంద్ర జడేజా (9) బ్యాట్ జులిపించారు. కీమో పాల్ వేసిన ఆఖరి ఓవర్లో ఇద్దరు మూడు సిక్సర్లు బాదారు. కృనాల్ తొలి రెండు బంతుల్ని సిక్సర్లు బాదగా.. జడేజా ఐదో బంతిని సిక్సర్గా మలిచాడు. ఈ ఓవర్లో టీమిండియా ఏకంగా 20 పరుగులు పిండుకుంది. విండీస్ బౌలర్లలో కాట్రెల్, థామస్ తలో రెండు వికెట్లు తీశారు.