
మనం ఇళ్లలో పెంచుకునే కుక్కపిల్లలు కుటుంబ సభ్యుల్లాగే కలిసిపోతాయి. అయితే వాటి జీవితకాలం తక్కువ కావడంతో ఏదో ఒక తరుణంలో అవి మనల్ని విషాదంలో ముంచి వెళ్లిపోతాయి. టీమిండియా సారధి రోహిత్ శర్మ జీవితంలో అలాంటి ఘటనే జరిగింది. శ్రీలంకతో మ్యాచ్ ఆడేందుకు అతను సిద్ధం అవుతున్న సమయంలోనే ఈ విషాదం చోటు చేసుకోవడం బాధాకరం. ఈ వార్తను రోహిత్ భార్య రితిక సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
శ్రీలంక మ్యాచ్ మొదలవడానికి ఒక రోజు ముందే ఈ ఘటన జరిగింది. సోమవారం జరిగిన ఈ విషాదం గురించి రితిక చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. 'మా జీవితాల్లో నిన్న చాలా బాధాకరమైన రోజు. మా జీవితంలో ఎంతో ప్రేమించిన వాళ్లకు వీడ్కోలు పలకాల్సి వచ్చింది. నువ్వు అందరి కన్నా బెస్ట్ ఫర్ బేబీవి. ఎవరూ నీ కన్నా బెటర్ ఫ్రెండ్ను పొందలేరు.
నా తొలి ప్రేమ, మొదటి బిడ్డ, అత్యంత సున్నితమైన ప్రాణం.. మళ్లీ నిన్ను కలిసే వరకు మా జీవితాల్లో ఏదో కోల్పోయిన బాధ అలాగే ఉంటుంది' అని పోస్టు చేసింది. ఆమె చేసిన పోస్టుపై సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ ప్రేయసి అతియా శెట్టి, ముంబై ఇండియన్స్ యువ ప్లేయర్ తిలక్ వర్మ తదితరులు స్పందించారు. రోహిత్ శర్మ కుటుంబంలోని ఆ కుక్క పిల్ల ఫొటోలను కూడా ఆమె షేర్ చేసింది.
ఈ పోస్టు చూసిన అభిమానులు కూడా దీనిపై రియాక్ట్ అవుతున్నారు. తమకు ఎదురైన అలాంటి అనుభవాలను షేర్ చేసుకున్నారు. కుక్కపిల్ల చనిపోతే ఆ బాధ తట్టుకోలేమని అంటున్నారు. ఈ బాధ నుంచి హిట్మ్యాన్ కోలుకోవాలని ఆశిస్తూ ధైర్యం చెప్పారు. కాగా, శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో రోహిత్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. సెంచరీ చేసేలా కనిపించిన అతను 83 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బంతిని వికెట్ల మీదకు ఆడుకొని పెవిలియన్ చేరాడు.