
హైదరాబాద్: భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ అంటే అందరికీ ఆ సిక్సే గుర్తొంస్తుందేమో.. అంతటి స్థాయిలో రెచ్చిపోయి ఆడాడు దినేశ్ కార్తీక్. నిదహాస్ ట్రోఫీ ఫైనల్ ఆఖరి బాల్కు కొట్టిన సిక్స్ ఇప్పటికీ అందరికి కళ్లు ముందే కనిపిస్తోంది. కొంతమందైతే ఈ వీడియోను సోషల్ మీడియాలో కూడా షేర్ చేసేస్తున్నారు. అయితే ఈ సూపర్ సిక్స్ను కెప్టెన్ రోహిత్ మాత్రం మిస్సయ్యానంటున్నాడు.
రోహిత్ డ్రెస్సింగ్ రూమ్లోనే ఉంటాడు. మరి చూడటం ఎందుకు మిస్సవుతాడు. అనే ప్రశ్న రాకమానదు. మ్యాచ్ తర్వాత ఈ విషయాన్ని స్వయంగా చెప్పాడు. అంతేకాదు మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ తాను ఎందుకు ఆ సిక్స్ చూడేలేకపోయాడో చెప్పాడు.
'చివరి ఓవర్లో ఆఖరి రెండు బంతుల్లో ఐదు పరుగులు చేయాలి. ఐదో బంతికి శంకర్ ఔటయ్యాడు. అప్పటికి మా జట్టు స్కోరు 162. ఇక మిగిలింది ఒకటే బంతి. స్ట్రైకింగ్లో కార్తీక్ ఉన్నాడు. ఎలాగైనా ఫోర్ కొడతాడు.. దీంతో మ్యాచ్ డ్రా అవుతుంది. సూపర్ ఓవర్ ద్వారానే ఫలితం దక్కుతుంది అని భావించి డ్రస్సింగ్ రూమ్లోకి వెళ్లి ప్యాడ్ కట్టుకుంటున్నాను. ఆ సమయంలోనే కార్తీక్ సిక్స్ బాదేసి భారత్కు విజయం ఖరారు చేసేశాడు. డ్రస్సింగ్ రూమ్లోనే ఉన్న నేను ఆ సిక్స్ను చూడలేకపోయా' అని వివరించాడు రోహిత్ శర్మ.
ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. భారత్తో పాటుగా సంబరాల్లో శ్రీలంక క్రికెట్ అభిమానులు సైతం పాల్గొన్నారు.