అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్కు సన్నాహకంగా భావించిన ఈ సిరీస్ అభిమానులను అలరించింది. అయితే చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆఖరి టీ20పై ఇప్పటికీ తీవ్ర చర్చలు సాగుతున్నాయి. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్ టైగా ముగిసింది. అనంతరం సూపర్ ఓవర్లో ఇరు జట్ల స్కోరు సమం కావడంతో, ఫలితం కోసం మరో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. మొత్తంగా టీమిండియా విజయం సాధించింది.
అయితే రెండో సూపర్ ఓవర్లో రోహిత్ శర్మ బ్యాటింగ్కు రావడం నిబంధనలకు విరుద్ధమని విమర్శలు వస్తున్నాయి. తొలి సూపర్ ఓవర్ ఆఖరి బంతి ముందు హిట్ మ్యాన్ స్వతహాగా పెవిలియన్కు చేరాడు. అయితే అతడు రిటైర్డ్ ఔట్గా స్కోరుబోర్డులో ప్రత్యక్షమైంది. కానీ రెండో సూపర్ ఓవర్లో కూడా రోహిత్ తిరిగి బ్యాటింగ్కు వచ్చాడు. దీన్ని అఫ్గానిస్థాన్ కోచ్ జొనాథన్ ట్రాట్, టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రాతో పాటు పలు విశ్లేషకులు తప్పుబట్టారు.

తాజాగా ఈ వివాదంపై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ స్పందించాడు. రోహిత్కు మద్దతుగా నిలిచాడు. రోహిత్ రిటైర్డ్ హట్గా వెనుదిరిగి ఉంటాడని, కానీ స్కోరు బోర్డు నిర్వాహకులు తప్పుగా గణాంకాలు చూపించి ఉంటారని అన్నాడు. ''డబుల్ సూపర్ ఓవర్ జరుగుతుందని అసలు ఊహించలేదు. తొలి సూపర్ ఓవర్లో ఔటైన తర్వాత రెండో సూపర్ ఓవర్లో బ్యాటింగ్కు రావడానికి అవకాశం లేదు. అయితే రోహిత్ శర్మ గాయం కారణంగా రిటైర్డ్ హట్గా వెనుదిరిగి ఉంటాడని భావిస్తున్నా. ఆ సమయంలో స్కోర్ బోర్డులో అతడు ఔట్గా పొరపాటుగా చూపించి ఉంటారని అనుకుంటున్నా'' అని డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానెల్లో వివరించాడు.
అఫ్గాన్ మూడో టీ20లో రోహిత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 22/4తో కష్టాల్లో నిలిచిన టీమిండియాను రింకూ సింగ్ (69*; 39 బంతుల్లో)తో కలిసి అద్భుత పోరాటంతో ఆదుకున్నాడు. 69 బంతుల్లో అజేయంగా 121 రన్స్ చేశాడు. 11 ఫోర్లు , 8 సిక్సర్లు బాదాడు. తొలి సూపర్ ఓవర్ ఛేజింగ్లో రోహిత్ రెండు సిక్సర్లు సాధించాడు. అయితే ఆఖరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన సందర్భంలో రింకూ సింగ్ వేగంగా పరిగెత్తగలడని రోహిత్ రిటైర్డ్ హట్గా వెనుదిరిగాడు. కానీ ఒక్క పరుగే లభించడంతో మరో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. రెండో సూపర్ ఓవర్లో టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 11 పరుగులు చేసింది. ఆ స్కోరంతా రోహిత్ సాధించాడు.
కాగా, రోహిత్ ప్రస్తుతం ఇంగ్లాండ్ టెస్టులకు సన్నద్ధమవుతున్నాడు. తొలి టెస్టు కోసం టీమిండియాతో పాటు ఇంగ్లాండ్ జట్టు ఇప్పటికే హైదరాబాద్కు చేరుకున్నాయి. అయితే రోహిత్ ఆదివారం ముంబయిలోనే ప్రాక్టీస్ చేశాడు. ఇంకా భారత జట్టుతో చేరలేదు. అయిదు టెస్టుల సిరీస్లో భాగంగా ఉప్పల్ వేదికగా మొదటి టెస్టు జరగనున్న విషయం తెలిసిందే.