
అవకాశాలు అంతంతమాత్రమే..
ఇంత నిలకడగా ఆడుతున్న అతన్ని గతేడాది టీ20 వరల్డ్ కప్ ఆడిస్తారని అంతా అనుకున్నారు. కానీ సెలెక్టర్లు మాత్రం దినేష్ కార్తీక్, రిషభ్ పంత్లను ఎంపిక చేశారు. సంజూను కేవలం వన్డేలకు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సెలెక్టర్లు చెప్పారు. వరల్డ్ కప్ తర్వాత న్యూజిల్యాండ్తో ఆడిన మూడు టీ20ల సిరీస్కు సంజూ ఎంపికైనా ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఆ తర్వాత తొలి వన్డేలో రాణించినా.. మిగతా మ్యాచుల్లో అతన్ని బెంచ్కే పరిమితం చేశారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ పర్యటనకు కూడా సంజూను ఎంపిక చేయలేదు.

సంజూకే సెలెక్టర్ల ఓటు
ఇలాంటి సమయంలో వచ్చే ఏడాది శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్కు సంజూ ఎంపికయ్యాడు. అయితే ఆ తర్వాత జరిగే వన్డే సిరీస్కు మాత్రం అతన్ని సెలెక్టర్లు పక్కన పెట్టారు. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో సంజూకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని నిపుణులు చేసిన సూచనలు తుంగలో తొక్కేశారు. దీనిపై అభిమానులు నెట్టింట పెద్ద గొడవే చేశారు. అయితే ఇప్పుడు తాజాగా బయటకు వస్తున్న వార్తల ప్రకారం, వన్డే సిరీస్కు కూడా సెలెక్టర్లు సంజూను సెలెక్ట్ చేయాలని అనుకున్నారట. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ దీనికి ఒప్పుకోలేదట.

వద్దంటే వద్దన్న రోహిత్
ఫామ్లో లేని కేఎల్ రాహుల్ స్థానంలో సంజూ శాంసన్ను ఎంపిక చేస్తామని సెలెక్టర్లు అంటే.. రోహిత్ మాత్రం రాహుల్ జట్టులో ఉండాలని పట్టుబట్టాడట. సంజూ వద్దని ఖరాఖండీగా చెప్పేశాడట. వన్డేల్లో ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్లు చాలని స్పష్టం చేశాడట. దీంతో ఈ వన్డే సిరీస్కు సంజూను పక్కన పెట్టినట్లు బీసీసీఐ వర్గాలు చెప్తున్నాయి. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్.. రోహిత్ శర్మపై మండి పడుతున్నారు. సంజూ అంటే ఎందుకంత కక్ష? అని ప్రశ్నిస్తున్నారు. బయటకేమో సంజూ మ్యాచ్ విన్నర్ అని కహానీలు చెప్పే రోహిత్.. ఇలాంటి కుళ్లు రాజకీయాలు చేయడం బాగలేదని తిట్టిపోస్తున్నారు.


Click it and Unblock the Notifications












