
ఒకరిద్దరు బౌలర్లు కాదు..
న్యూజిల్యాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్, పాక్ పేసర్ షహీన్ అఫ్రిదీ, ఇంగ్లండ్లో రీస్ టాప్లే, ఆస్ట్రేలియాలో మిచెల్ స్టార్క్.. వీళ్లంతా భారత బ్యాటర్లను, ముఖ్యంగా ఓపెనర్లను ఇబ్బంది పెట్టిన వారే. యూఏఈలో జరిగిన టీ20 వరల్డ్ కప్లో షహీన్ అఫ్రిదీ బౌలింగ్లో భారత టాపార్డర్ ఎంత ఘోరంగా కుప్పకూలిందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇంగ్లండ్లో అప్పటి వరకు జట్టులో చోటు దక్కించుకోవడానికి కష్టపడిన రీస్ టాప్లే.. భారత్పై చెలరేగాడు. దీనికి కారణం కేవలం అతని సత్తానే కాదు. మన బ్యాటర్ల బలహీనత కూడా.

రెండో వన్డేలో అదే సీన్..
తాజాగా విశాఖలో జరిగిన రెండో వన్డేలో మిచెల్ స్టార్క్ కూడా భారత బ్యాటింగ్ లైనప్ను ముప్పుతిప్పలు పెట్టాడు. అతని బౌలింగ్లో ఆడేందుకు టీమిండియాలో కోహ్లీ తప్ప మిగతా స్పెషలిస్టు బ్యాటర్లంతా వణికిపోయారంటే తప్పులేదు. అయితే భారత జట్టులో ఇలాంటి బలహీనత ఏం లేదని కెప్టెన్ రోహిత్ శర్మ బుకాయించాడు. ప్రత్యర్థి జట్టులో టాప్ బౌలర్లు ఉన్నారని, వాళ్లు ఎడం చేతి వాటమైనా కుడి చేతి వాటమైనా సత్తా ఉంటే వికెట్లు పడతాయని చెప్పాడు. తాము ఈ విషయంపై ఎక్కువ పోకస్ పెట్టడం లేదని స్పష్టం చేశాడు.

ఆ బలహీనత లేదు..
'ప్రత్యర్థి జట్టులో క్వాలిటీ బౌలర్ ఉంటే అతను కచ్చితంగా వికెట్లు తీసుకుంటాడు. మన బెస్ట్ ప్లేయర్లను అవుట్ చేయడానికి అతను చాలా కష్టపడతాడు. వాళ్లు లెఫ్ట్ ఆర్మ్ అయినా లేక రైట్ ఆర్మ్ బౌలర్ అయినా సరే.. వాళ్లకు వికెట్లు పడతాయి. కుడి చేతి వాటం బౌలర్లు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. దాని గురించి ఎవరూ మాట్లాడరే?' అని రోహిత్ నిలదీశాడు. వికెట్లు పడితే అది సమస్య అని, ఇలా ఎందుకు అవుట్ అవుతున్నామని పరిశీలిస్తామని చెప్పుకొచ్చాడు. 'ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? అని ఆలోచిస్తాం. గడిచిన ఆరు వన్డేల్లో టాపార్డర్ బ్యాటర్లు భారీ స్కోర్లు చేసిన విషయం మర్చిపోకూడదు. నిజంగా అదొక సమస్య అనుకుంటే.. తప్పకుండా దానిపై కూడా దృష్టి పెడతాం' అని పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications












