కొన్నిరోజులుగా టీమిండియా స్టార్ ఆటగాళ్ల వర్క్లోడ్ మేనేజ్ చెయ్యాలని, ముఖ్యంగా ఐపీఎల్లో దీనిపై బీసీసీఐ దృష్టి పెట్టాలని చాలా మంది అంటున్నారు. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ సారధి రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నాడు. వర్క్లోడ్ మేనేజ్ చేసుకునేందుకు ఐపీఎల్ ఆరంభ మ్యాచులకు దూరం అవ్వాలని డిసైడ్ అయ్యాడు. అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్కు జట్టు పగ్గాలు అందించాలని ముంబై యాజమాన్యం అనుకుంటోంది. దీంతో రోహిత్ నిర్ణయంపై రకరకాలుగా ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. కానీ రోహిత్ నిర్ణయం చాలా బెటర్ అని నిపుణులు అంటున్నారు.
ఓపెనర్ గ్రీన్
ఐపీఎల్ మినీ వేలంలో గట్టి పోటీ తట్టుకొని, భారీ ధరకు ఆసీస్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ను ముంబై కొనుగోలు చేసింది. అయితే అతన్ని ఏ స్థానంలో ఆడిస్తారనే విషయంపై పెద్ద ప్రశ్న తలెత్తింది. భారత్తో సిరీస్లో ఓపెనర్గా వచ్చిన గ్రీన్ చెలరేగాడు. అయితే రోహిత్, ఇషాన్ ఉండగా అతన్ని ఓపెనింగ్ పంపడం కుదరదు. ఇప్పుడు రోహిత్ లేకపోవడంతో గ్రీన్ను ఓపెనర్గా ప్రయత్నించవచ్చు. అతను కనుక ఆశించినట్లే చెలరేగితే గ్రీన్ను ఓపెనర్గా కొనసాగించి, రోహిత్ కూడా మిడిలార్డర్లో ఆడొచ్చు.

కెప్టెన్ సూరీడు..
ప్రస్తుతం ప్రపంచ నెంబర్ వన్ టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. ముంబైలో అతని భవిష్యత్తు ఏంటనే విషయంలో కూడా క్లారిటీ లేదు. అయితే కొందరు మాత్రం అతనిలో కెప్టెన్సీ లక్షణాలు ఉన్నాయని చెప్తున్నారు. గతంలో కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)లో ఉన్నప్పుడు కూడా గంభీర్.. తన డిప్యూటీ బాధ్యతలను పలుమార్లు సూర్యకు అప్పజెప్పాడు. ఈ క్రమంలో రోహిత్ గైర్హాజరీలో సూర్య కనుక కెప్టెన్గా నిరూపించుకుంటే.. రోహిత్ రిటైర్ అయిన తర్వాత ముంబై కెప్టెన్ ఎవరని ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు. డైరెక్ట్గా సూర్యకు కెప్టెన్సీ ఇచ్చేయొచ్చు.
గాయాల బెడద..
రోహిత్ శర్మ కెరీర్లో గాయాల ప్రభావం చాలా ఎక్కువ. ఈ కారణంగానే అతను చాలా టెస్టులకు దూరం అయ్యాడు. ఇంగ్లండ్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచులో కరోనా సోకి ఆడలేదు. గతేడాది చివర్లో బంగ్లాదేశ్ పర్యటనలో కూడా అతను గాయంతో ఆడలేదు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ముగియగానే వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడాల్సి ఉంది. అలాంటప్పుడు రోహిత్ రిస్క్ తీసుకోకుండా ఇలా రెస్ట్ తీసుకోవడం చాలా మంచి ఆలోచన అని చెప్పాలి.