అన్ని ఫార్మాట్లలో ఓపెనర్గా సత్తాచాటిన ఆటగాళ్లు చాలా అరుదు. భారత క్రికెట్లో వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత అదే స్థాయిలో మూడు ఫార్మాట్లలో డాషింగ్ ఓపెనర్గా రోహిత్ శర్మ ఘనత సాధించాడు. అయితే టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఆరేళ్లకు రోహిత్కు ఓపెనర్గా అవకాశం వచ్చింది. 2013లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో హిట్మ్యాన్ సుదీర్ఘ ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చాడు.
2019 వరకు రోహిత్ 3, 4, 5, 6 స్థానాల్లో బ్యాటింగ్కు వచ్చాడు. అయితే అప్పటివరకు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. కాగా, 2019లో రోహిత్ శర్మను ఓపెనర్గా అప్పటి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రిని ప్రమోట్ చేశారు. ఆ తర్వాత రోహిత్ టెస్టు కెరీర్ మారిపోయింది. ఓపెనర్గా అరంగేట్ర మ్యాచ్లోనే 176 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు. వైజాగ్లో దక్షిణాఫ్రికాపై విధ్వంసం సృష్టించాడు.

కాగా, రోహిత్ శర్మ 2.0కి సరిగ్గా నేటితో అయిదేళ్లు. ఈ నేపథ్యంలో టెస్టు కెరీర్ గురించి ఓ ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ ఇటీవల మాట్లాడిన వీడియో వైరల్గా మారింది. దానిలో.. విరాట్ కోహ్లి, రవిశాస్త్రి ఇచ్చిన అవకాశం తనకు టెస్టుల్లో పునర్జన్మ లాంటిదని రోహిత్ పేర్కొన్నాడు. టెస్టుల్లో ఓపెనర్గా ప్రమోట్ చేయడం అంత తేలికైన నిర్ణయం కాదని, కానీ వారిద్దరు తీసుకున్న నిర్ణయం టెస్టుల్లో తనకి సరికొత్త కెరీర్ లభించిదని రోహిత్ తెలిపాడు.
''టెస్టు కెరీర్లో నా సెకండ్ ఇన్నింగ్స్ ఎంతో బాగుంది. అయితే ఓపెనర్గా అవకాశం ఇచ్చిన రవిశాస్త్రి, విరాట్ కోహ్లికి కృతజ్ఞతలు చెప్పాలి. సుదీర్ఘ ఫార్మాట్లో ప్రమోట్ చేయడం అంత తేలికైన నిర్ణయం కాదు. కానీ నాపై నమ్మకం ఉంచి వారిద్దరు అవకాశం ఇచ్చారు. ప్రాక్టీస్ మ్యాచ్ ఆడమన్నారు. ఆ మ్యాచ్లో నేను మొదటి బంతికే డకౌటయ్యా. అయితే టెస్టు క్రికెట్లో వారిచ్చిన అవకాశం నాకు పునర్జన్మ లాంటిది'' అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
కాగా, రోహిత్ చేసిన వ్యాఖ్యలను ఆర్సీబీ ట్వీట్ చేసింది. దానికి ఇలా క్యాప్షన్ రాసుకొచ్చింది. 'ప్రతి ఛాంపియన్కు కూడా ప్రోత్సాహం అవసరం. మీతో పాటు మీ చుట్టూ ఉన్న వాళ్లు కూడా మీపై నమ్మకం ఉంచితే గొప్ప ఘనతలు సాధించవచ్చని రోహిత్ శర్మ నూటికి నూరు శాతం రుజువు చేశాడు'' అని ఆర్సీబీ పేర్కొంది.