అత్యధిక పరుగులు..
వన్డే ఫార్మాట్లో భారత్ తరఫున ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శ్రేయాస్ అయ్యర్ రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది ఆరంభం నుంచి నిలకడగా రాణిస్తున్న శ్రేయాస్.. బంగ్లాపై 82 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా శిఖర్ ధవన్ (685)ను శ్రేయాస్ అధిగమించాడు. శ్రేయాస్ ఈ ఏడాదిలో మొత్తం 14 ఇన్నింగ్స్లలో బ్యాటింగ్ చేశాడు. వీటిలో 60.08 సగటుతో 721 పరుగులు చేశాడు.
మెహదీ మాయ..
తొలి వన్డేలో చివరి వరకు పోరాడి బంగ్లాను గెలిపించిన మెహదీ హసన్.. రెండో వన్డేలో సెంచరీతో చెలరేగాడు. 8వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అతను కేవలం 83 బంతుల్లో అజేయ శతకం సాధించాడు. ఈ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి సెంచరీ సాధించిన తొలి ఆసియా క్రికెటర్గా మెహదీ హసన్ రికార్డు సృష్టించాడు. బంగ్లా జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన అతను.. ఆ జట్టుకు మంచి స్కోరు అందించాడు. బౌలింగ్లో కూడా రాణించి రెండు వికెట్లు తీసుకున్నాడు. ఓవరాల్గా చూసుకున్నా మెహదీ హసన్.. ఈ రికార్డు సాధించిన రెండో బ్యాటర్ మాత్రమే. గతేడాది ఐర్లాండ్ ప్లేయర్ సిమి సింగ్.. సౌతాఫ్రికాపై ఈ రికార్డు నెలకొల్పాడు.
రోహిత్ సిక్సర్ల మోత..
బొటనవేలి గాయంతో మ్యాచ్ ఆడడని అనుకున్న రోహిత్ శర్మ తన కెరీర్లో తొలిసారి 9వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. జట్టును గెలిపించడానికి విశ్వప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే 5 సిక్సర్లతో కేవలం 28 బంతుల్లోనే 51 పరుగులతో అజేయంగా నిలిచాడు. కానీ భారత జట్టును గెలిపించలేకపోయాడు. అయితే ఈ క్రమంలో ఒక అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 500పైగా సిక్సర్లు బాదిన రెండో ఆటగాడిగా, తొలి భారత ప్లేయర్గా రికార్డు నెలకొల్పాడు. రోహిత్ తన కెరీర్లో మొత్తం 502 అంతర్జాతీయ సిక్సర్లు బాదాడు. అతని కన్నా ముందు ఈ జాబితాలో యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ (553) మాత్రమే ఉన్నాడు.