Rohit Sharma: టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన చరిత్ర సృష్టించాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో ముంబైకి చెందిన స్టార్ క్రికెటర్ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. 38 ఏళ్ల 182 రోజుల వయస్సులో నంబర్ వన్ ర్యాంకు సాధించడం ద్వారా రోహిత్ శర్మ కొత్త చరిత్ర సృష్టించాడు. ఇంతకు ముందు అగ్రస్థానంలో ఉన్న భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ను వెనక్కి నెట్టి రోహిత్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. రోహిత్ శర్మ తన కెరీర్లో మొట్టమొదటిసారిగా నంబర్ వన్ ర్యాంకును దక్కించుకోవడానికి ఆస్ట్రేలియాపై ఇటీవల జరిగిన వన్డే సిరీస్లో చూపిన అత్యుత్తమ ఫామ్ కారణమైంది. అడిలైడ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో 97 బంతుల్లో 73 పరుగులు చేశాడు. సిడ్నీ వేదికగా జరిగిన మూడో వన్డేలో 125 బంతుల్లో 121 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. రెండు భారీ ఇన్నింగ్స్ల కారణంగా రోహిత్ శర్మ రేటింగ్ పాయింట్లు గణనీయంగా పెరిగాయి. తద్వారా అగ్రస్థానంలో నిలిచాడు.
ఐదో భారత ఆటగాడిగా అరుదైన ఘనత
వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంకు సాధించిన భారత క్రికెటర్లలో రోహిత్ శర్మ ఐదో వ్యక్తిగా నిలిచారు. ఈ ఎలైట్ జాబితాలో ఆయన క్రింది దిగ్గజాల సరసన చేరారు.
*సచిన్ టెండూల్కర్
*మహేంద్ర సింగ్ ధోని
*విరాట్ కోహ్లీ
*శుభ్మన్ గిల్

గిల్, కోహ్లీ ర్యాంకులలో కదలిక
రోహిత్ శర్మ అగ్రస్థానం దక్కించుకోవడం వల్ల ఇతర భారత బ్యాటర్ల ర్యాంకింగ్స్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆస్ట్రేలియా సిరీస్లో (10, 9, 24 పరుగులు) నిరాశపరిచిన గిల్... నంబర్ వన్ స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయారు. విరాట్ కోహ్లీ మొదటి రెండు మ్యాచ్లలో డకౌట్ అయినప్పటికీ.. చివరి మ్యాచ్ (సిడ్నీ)లో 81 బంతుల్లో నాటౌట్ 74 పరుగులు చేసి ఫామ్ను తిరిగి పొందారు. అయినప్పటికీ ఆయన ఐదో స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఈ ప్రదర్శనతో ఆయన రేటింగ్ పాయింట్లు 724 నుంచి 730కి పెరిగాయి.