Rohit Sharma: టీ20 క్రికెట్లో 12 వేల పరుగులు పూర్తి చేసిన రెండో భారతీయుడిగా వెటరన్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ 41వ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్పై తన 12వ పరుగుతో ముంబై ఇండియన్స్ స్టార్ ఈ మైలురాయిని సాధించాడు. మొత్తం మీద రోహిత్ శర్మ ఈ ఘనత సాధించిన ఎనిమిదో బ్యాటర్ అయ్యాడు.
ఈ దిగ్గజాల సరసన చేరిన రోహిత్ శర్మ
రోహిత్ శర్మ ఇప్పుడు 456 టీ20లలో (443 ఇన్నింగ్స్లు) 12,000 పరుగులు దాటాడు. రోహిత్ శర్మ తన 17 సంవత్సరాల కెరీర్లో 8 సెంచరీలు 79 అర్థ సెంచరీలు చేశాడు. ఈ ఫార్మాట్లో పరుగుల పరంగా రోహిత్ కంటే క్రిస్ గేల్ (14,562), అలెక్స్ హేల్స్ (13,610), షోయబ్ మాలిక్ (13,571), కీరన్ పొలార్డ్ (13,537), విరాట్ కోహ్లీ (13,208), డేవిడ్ వార్నర్ (13,019), జోస్ బట్లర్ (12,469) రోహిత్ శర్మ కంటే ముందున్నారు.

ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు
రోహిత్ శర్మ చేసిన టీ20 పరుగులలో 6,700కు పైగా ఐపీఎల్లోనే వచ్చాయి. రోహిత్ శర్మ ప్రస్తుతం ఈ లీగ్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా ఉన్నాడు. విరాట్ కోహ్లీ(8,326) తర్వాత రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ 265 ఐపీఎల్ మ్యాచ్ల్లో ఆడాడు. 30 సగటుతో ఐపీఎల్ లో రెండు సెంచరీలు, 44 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ జట్టుకు ఐదు ఐపీఎల్ టైటిల్స్ ను గెలిపించాడు.
టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు
2024లో రోహిత్ శర్మ భారత్కు ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ను అందించిన తర్వాత టీ20 క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. రోహిత్ శర్మ టీ20 అంతర్జాతీయ క్రికెట్ లో 4 వేల కంటే ఎక్కువ పరుగులు చేసి ముగ్గురు క్రికెటర్లలో ఒకడు. మరో ఇద్దరు విరాట్ కోహ్లీ, బాబర్ ఆజం. ఈ జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో 4,231 పరుగులు సాధించాడు.
కెప్టెన్గా 6,000 కంటే ఎక్కువ టీ20 పరుగులు
టీ20 క్రికెట్లో కెప్టెన్గా 6,000 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఐదుగురు ఆటగాళ్లలో రోహిత్ ఒకరు. రోహిత్ శర్మ ఈ రికార్డును కోహ్లీ (6,564), ఎంఎస్ ధోని (6,220-ప్లస్), ఫాఫ్ డు ప్లెసిస్ (6,137), జేమ్స్ విన్స్ (6,131) లతో పంచుకున్నాడు.